Blogger Widgets

శనివారం, అక్టోబర్ 31, 2015

వల్లభాయ్ పటేల్

శనివారం, అక్టోబర్ 31, 2015




ఉక్కుమనిషిగా మనకు బాగా తెలిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875, అక్టోబరు 31న గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి జవేరిభాయ్ పటేల్ వ్యసాయం చేసేవాడు. తల్లి లాద్ బాయ్. వారికి ఆరుగురు సంతానంలో పటేల్ నాల్గవవాడు. వారిది చాలా పేదకుటుంబం అవ్వటం వలన  పిల్లల్ని చదివించటం చాలా కష్టంగా వుండేది.  వల్లభాయ్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్కూల్ చదువు వరకు చదవగలిగాడు. పటేల్ స్కూలులో చదువుతున్నప్పుడు పుస్తకాలు కొనుక్కొనే పరిస్థితి  లేకపోవటం వలన తన  స్నేహితుల దగ్గర పుస్తకాలు తీసుకొని వాటిని పూర్తిగా బట్టి పట్టేవాడు.  ఒక రోజు తన ఉపాధ్యాయుడు నీ పుస్తకం ఏది?" అని అడిగినప్పుడు, ఎంతో ధైర్యంతో "నాకు పుస్తకాలు కొనుక్కొనే స్తోమత లేదు కాబట్టి నోట్సు మాత్రమే రాస్తున్నాను. కానీ టెక్స్ట్ పుస్తకాల్లో ఇంత వరకు జరిగిన పాఠాలు అన్ని నాకు అక్షరం తప్పకుండా గుర్తున్నాయి అని చెప్పాడు. ఆ సమాధానం విన్న ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయి "ఏదీ ఆహార నియమాలు పాఠం చెప్పు చూద్దాం" అని అడిగాడు. అంతే పటేల్ అక్షరం పొల్లు పోకుండా పాఠాన్ని గడగడా అప్పజేప్పేసాడు . అది విని ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. మెట్రిక్యులేషన్ తరువాత, కాలేజీ చదువులకు స్తోమతలేకపోవటం వల్ల ప్లీడరు పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యి, గోధ్రా అనే చిన్న పట్టణంలో ప్రాక్టీసు ప్రారంబించాడు. ప్రారంభించిన కొద్దిరోజులకే పటేల్ ప్రతిభను అందరూ గుర్తించసాగారు. అతను పట్టిన కేసులు ఓడిపోవటం అంటూ ఎప్పుడూ జరగలేదు. చివరకు ఆంగ్లేయులైన జడ్జీలు కూడా అతని వాదనను విని ముచ్చట పడేవారు.  ఇంగ్లాండులో బారిష్టరు పరీక్ష చదివేనిమిత్తం తనకు ప్రయాణంలో సహాయం చేయమని అర్ధిస్తూ వల్లభాయ్ పటేల్ ఒక ట్రావెల్ ఏజన్సీకి లేఖ రాశాడు. అది చదివిన ఏజన్సీవారు వెంటనే సహాయం చేయటానికి అంగీకరించి లేఖరాశారు. 1913లో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై భారతదేశం తిరిగి వచ్చి తన ప్రాక్టీసును మరింత వృద్ది చేసుకున్నాడు. ఆ సమయంలో బొంబాయి చీఫ్ జస్టిస్, సర్ బాసిన్ స్కాట్ పటేల్ ని ప్రభుత్వ సర్వీసులో చేరమని ఆహ్వానించాడు. అయితే దేశాభిమానం మెండుగాగల పటేల్ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి క్రిమినల్ లాయరుగా పేరు ప్రఖ్యాతలు పొందసాగాడు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగామహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. 1917లో మొదటిసారిగా పటేల్ కు గాంధీలోని నిర్మలత్వం, నిరాడంబరత్వం, స్వార్ధరహిత ప్రేమ, దేశాభిమానం పటేల్ ను విశేషంగా ఆకర్షించాయి. భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చి, విభజించిపాలిస్తున్న ఆంగ్లేయులను తరిమి కొట్టాలనే ధృఢ నిశ్చయం ఆక్షణంలోనే తీసుకున్నాడు. ప్రజలలోకి చొచ్చుకొనిపోయి, వారి అవసరాలను తీర్చి, సహాయ సహకారాలు అందజేసి, వారిసహాయంతోనే విదేశీయుల్ని వెళ్ళగొట్టవచ్చుననే అభిప్రాయం కలిగి అహమ్మదాబాదు మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. పటేల్ అధ్యక్షుడిగా నిర్వహణా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన చేసిన సేవల వర్ణనాతీతం. నగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించటం జరిగింది అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలూ వ్యాపారసంస్థలూ అన్నీ మూసేసి ప్రజలు భయబ్రాంతులై ఉన్న సమయంలో పటేల్ ఆరోగ్య అధికారులతో నగరంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోనూ తిరిగి ఒక్కరినీ వదలకుండా అందరికీ వైద్యం అందించాడు. రోగుల దగ్గర నిర్విరామంగా గడపటం వలన ఆయనకు కూడా దురదృష్టవశాత్తు ఆ వ్యాధి సోకింది. కొద్ది రోజుల్లోనే ఆయనకు వ్యాధి తగ్గింది.ప్లేగు వ్యాప్తి చెందినప్పుడే కాకుండా, వరదల్లోనూ, కరువుకాటకాల్లోనూ ప్రజలకు అండగానిలిచి వారి అభిమానం చూరగొన్నాడు.  ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు. 
గాంధీజీతో పాటు అనేక సత్యాగ్రహాలు చేసి సహాయ నిరాకరణోధ్యమాలు నిర్వహించి కారాగారాలు అనుభవించి బ్రిటీషు వారి గుండెల్లో గుబులు కలిగించాడు పటేల్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉధ్యమంలోనూ పాల్గొన్నాడు.  1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.

గురువారం, అక్టోబర్ 29, 2015

గౌరీవ్రతము / అట్లతద్ది

గురువారం, అక్టోబర్ 29, 2015

                       











ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు.

అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు. ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి.
వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి,  అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే. వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు. 
''ఇస్తినమ్మ వాయనం''
''పుచ్చుకుంటినమ్మ వాయనం'' 
''అందించానమ్మా వాయనం''
''అందుకున్నానమ్మా వాయనం''
''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''
''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''  
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి.  మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం.
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది.
ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది.
తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే  అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి.
నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం.
గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత.

చూడవమ్మ యశోదమ్మ




చూడవమ్మ యశోదమ్మ వాడ వాడల వరదలివిగో

పొంచి పులివాలు పెరుగు మించు మించు మీగడలు
వంచి వారలు వట్టిన కంచపుటుట్ల కాగులివో
పేరీ బేరని నేతులు చూరల వెన్నల జున్నులును
ఆరగించి యట నగుబాళ్ళు పార వేసిన బానలివిగో
తెల్లని కను దీగల సోగల చల్ల లమ్మేటి జవ్వనుల
చెల్లినట్లనె శ్రీ వేంకటపతి కొల్లలాడిన గురుతు లివిగో

మంగళవారం, అక్టోబర్ 27, 2015

వాల్మీకి జయంతి

మంగళవారం, అక్టోబర్ 27, 2015

వాల్మీకి జయంతి 27/10/2015.
వాల్మీకి సంస్కృత సాహిత్యం మొదటి కవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని  మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు.  అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.  వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది.   శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని  కలుసుకున్నారు.  వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు  సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు  రామాయణం బోధించాడు.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ,  అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. 
ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు.  ఆపేరు నిలిచిపోయింది.  వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. 

వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం అంతా  రాసేవరకూ సాగింది. మొదట  శ్లోక రచన చేసింది వల్మికినే. 
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ. 

ఆదివారం, అక్టోబర్ 25, 2015

పాబ్లో పికాసో

ఆదివారం, అక్టోబర్ 25, 2015

పాబ్లో పికాసో స్పానిష్ శిల్పి, చిత్రకారుడు. చిత్రలేఖనంలో క్యూబిజం (cubism)ను ప్రోత్సహించిన కళాకారుడు. ఇతడు 1881లో జన్మించాడు. 20వ శతాబ్ధంలో వచ్చిన చిత్రకారులలో అత్యంత ప్రసిద్ధి చెందిన వాడు . అతని పరిశోధక మేధస్సు చిత్రకళలో అనేక శైలులను, మాధ్యమాలను అనుసరించినది. పికాసో చిత్రించిన చిత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందినవి. 1973లో మరణించాడు.
1901 లో చిత్రించిన "తల్లిప్రేమ'.
1937 ఏప్రియల్లో ప్రాంకో, జర్మన్ మిత్రపక్షాల పురాతన గుయోర్నికో రాజధాని బాస్క్ ను బాంబులతో నేలమట్టం చేసిన సంఘటనకు ప్రతిస్పందిస్తూ పికాసో వేసిన చిత్రం- Guernica ఓ గొప్పకళాఖండం. దీనిలో ఎద్దులను కిరాతక సైనికులకు, దౌర్జన్యానికి చిహ్నంగా, గుర్రాలను ఎదురు తిరిగిన ప్రజానీకానికి, సాత్వికత్వానికి చిహ్నంగా పికాసో చిత్రించాడు. ఈ చిత్ర ఇతివృత్తం ఎద్దుల కుమ్ములాట, అమాయకుల ఊచకోతగా అభివర్ణించి, ఈ చిత్రాన్ని చిత్రించి ప్రపంచానికి అందించాడు పికాసో.
లే డెమొసెల్లిస్ డి అవినాన్ కూడా గొప్ప కళాఖండమే.
1962 లో అతడు ఇంటర్నేషనల్ లెనిన్ పీస్ ప్రైజ్ను అందుకొన్నాడు.

ఆదివారం, అక్టోబర్ 18, 2015

అరుణాం కరుణాతరంగితాక్షీం

ఆదివారం, అక్టోబర్ 18, 2015



బుధవారం, అక్టోబర్ 14, 2015

ఔనయ్య జాణడువు

బుధవారం, అక్టోబర్ 14, 2015


ఔనయ్య జాణడువు ప్రహ్లాద వరద
ఆసలు వెట్టకుము ప్రహ్లాదవరద ||

వేసరక శ్రీసతితో వేడుక నవ్వులు నవ్వి
ఆసలు చూపేవు ప్రహ్లాద వరద
సేస వెట్టిన చేతుల చెరగు వట్టి తిసేవు
ఆ సుద్దులె చెప్పేను ప్రహ్లాద వరద ||

నంటున తొడమీదను నలినాక్షి నెక్కించుక
అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరద
గెంటుక ఏ పొద్దును కేలుకేలు కీలించుక
అంటువాయ వదివో ప్రహ్లాద వరద ||

కందువతో కాగిలించి కైవసము సేసుకొంటి
వందముగ నీకెను ప్రహ్లాద వరద
పొంది శ్రీవేంకటమున పొంచి ఔభళములోన
అంది వరాలిచ్చేవు ప్రహ్లాద వరద ||

బ్రహ్మచారిణి

దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.
హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.
ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.
బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.
దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమెకృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

మంగళవారం, అక్టోబర్ 13, 2015

శైలపుత్రి

మంగళవారం, అక్టోబర్ 13, 2015

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥
దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.
పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.
సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.
తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.
సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.
‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.

సోమవారం, అక్టోబర్ 12, 2015

బతుకమ్మ బతుకమ్మ

సోమవారం, అక్టోబర్ 12, 2015

బతుకమ్మ కధ 

బతుకమ్మ పాట


ఆదివారం, అక్టోబర్ 11, 2015

పోలాంబ వ్రతం. పొలాల అమావాస్య

ఆదివారం, అక్టోబర్ 11, 2015

పోలాంబ వ్రతం.


 శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' అంటారు. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు

 తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు

అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం 
నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి,వరిపిండితోఅందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను  వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి,   ఆతర్వాత ఆకందమొక్కలోకి మంగళగౌరీదేవినిగానీ, సంతానలక్ష్మీదేవినిగానీ ఆవాహనచేసి,షోడశోపచారాలతోఅర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లుగారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు   ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక

 తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో
 కట్టాలి. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు.  ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు,మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే..,పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. ఇంకా పనసఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ  పిండి అందు లో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు.  నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు.  అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి వాటికి పూజ చేస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ... ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు.
జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ... ఆర్ధికంగాను ఆదుకుంటాయి.
తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను ... పెద్దలను ... పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ ... వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది. 
 
ఈ వ్రతంలో ముఖ్యమైన కధ ప్రచురణలో వుంది అది 
"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులుఅందరికీ పెళ్లిళ్ళు చేస్తారుఅందులోఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడుకానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడుఅలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుందిఅప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు పండుగ జరుపుకోలేకపోతున్నారు అని బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసిఉంచేస్తుందిఅందరూ పూజ చేసుకుంటారుఅది అయ్యాకఆమె  బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుందిఅదిచూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి  "ఎవరమ్మా నీవుఎవరా బాబుఎందుకు ఏడుస్తున్నావు?" అనిఅడుగుతారుదానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుందిదానికి వారు - "మేమే ఆర్చేవారము -తీర్చేవారము - చెప్పవమ్మాఅంటారుఆమె తన గోడు చెప్పుకుంటుందివారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహాఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారువారిని చూసిన ఆశ్చర్యంలో దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరుఅప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుందిఅక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారుఅప్పటినుండి ఆమె ప్రతి ఏటతప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు.
 కథ విన్న తరువాత చెప్పినవారు"పోలేరమ్మనీ ఇల్లు పాలతోనేతితో అలుకుతానునా ఇల్లు ఉచ్చతోపియ్యతో అలుకు", అంటారు.వినడానికి కొంచం వింతగా వుంటుంది.  కాని  అది వారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది  కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు. 

మంగళవారం, అక్టోబర్ 06, 2015

IPC ఇండియన్ పీనల్ కోడ్

మంగళవారం, అక్టోబర్ 06, 2015

మనం చాలా సార్లు  I P C  section ప్రకారం అని ఏదో  కొన్ని సందర్బాలలో మూవీస్, మరియు టీవీలలో, వార్తలలోను వినే వుంటాము.   అసలు I P C  section అంటే ఏమిటి ? దాని చరిత్ర ఏమిటి ?
భారతీయ శిక్షాస్మృతి (Indian Penal Code: IPC) భారత ప్రభుత్వ ధర్మశాస్త్రం. భారతదేశంలో నేరాలు చేసిన వారికి దీనిని అనుసరించే శిక్ష వేస్తారు.
ఇండియన్ పీనల్ కోడ్ వెనుక  చరిత్ర:-
ఇండియన్ పీనల్ కోడ్ (భారతీయ శిక్షాస్మృతి) 1860 - 6 అక్టోబర్ 1860 నాడు (1860 లో చేసిన 45 వ చట్టం) మొదలైంది.  ఇండియన్ పీనల్ కోడ్ జమ్ము కాశ్మీర్ లో కూడా అమలు లో ఉంది. కానీ, కానీ ఈ  రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనరు. రన్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్.పి.సి) అని అంటారు .  ఇండియన్ పీనల్ కోడ్ మొదలు   1860 నాటి ఆంగ్లేయుల పాలనలో (బ్రిటిష్ ఇండియా) ఉన్నాయి. 1860 నాటి బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం ప్రకారము  ఇండియన్ పీనల్ కోడ్ మనకు అమలులోకి వచ్చింది. మొట్టమొదటి ఇండియన్ పీనల్ కోడ్ డాక్యుమెంట్ ను  1860 లో, మొదటి లా కమిషన్ ఆధ్వర్యములో జరిగింది.  మొదటి లా కమిషన్ ఛైర్మన్ లార్డ్ మెకాలే . ఇతనే మన  భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు. మొదటి ఇండియన్ పీనల్ కోడ్ 1862 సంవత్సరంలో, అమలులోకి వచ్చింది. నాటినుంచి ప్రపంచంలోను, భారతదేశంలోను,  సమాజములోను, విద్య, వైజ్ఞానిక, సముద్రాలలో, సముద్ర గర్భాలలో, రోదసీ లోను, ప్రయాణ వాహనాలలోను,న్యాయపరంగా, వైద్యరంగంలోను, ఉద్యోగ రంగంలోను, బాంక్ లావాదేవీలు , సెల్ ఫోన్లు, సైబర్ నేరాలు, కంప్యూటర్ రంగాలలో జరిగిన సమస్తమైన మార్పులను, మన భారతీయ శిక్షాస్మృతి అనేకమైన మార్పులు , చేర్పులు అవుతునేవున్నాయి ,  కొత్తగా అనేక అనేక మార్పులు  పొందింది. గృహ హింస సెక్షన్ 498-ఎ  దానికి ఒక ఉదాహరణ. మన భారతీయ శిక్షాస్మృతి లో 511 సెక్షన్లు ఉన్నాయి. వరకట్నం ఛట్టాలు మరో ఉదాహరణ. వరకట్న సమస్య, యూరప్, అమెరికా దేశాలలో లేదు కాబట్టి , వరకట్న చట్టాలు, శిక్షలు వారి శిక్షా స్మృతి లో లేవు.  లార్డ్ మెకాలే, నాటి ఫ్రెంచి పీనల్ కోడ్ ను , లివింగ్‌స్టోన్స్ కోడ్ ఆఫ్ లూసియానా అనే రెండు ప్రామాణిక గ్రంధాలను ఆదర్శంగా తీసుకుని, మన ఇండియన్ పీనల్ కోడ్ 'డాక్యుమెంట్ ' ని తయారుచేసాడు.  భారతీయుల ప్రామాణిక గ్రంధాలైన మనుస్మృతి ని, యాజ్ఞవల్క్య స్మృతి ని , నాటి వైదిక పండితుల సలహా, సహాయం కూడా తీసుకున్నాడు. శిక్షల విషయంలో, ఆనాటి పెద్దలు, పండితులు, రాజులు అభిప్రాయాలను కూడా లెక్కలోకి తీసుకున్నాడు.  లార్డ్ మెకాలే మహా మేధావి అయినా, తన అభిప్రాయాలకంటే, నాటి భారత దేశమత, సాంఘిక , సామాజిక వ్యవస్థలకు, ఆఛార వ్యవహారాలకు విలువను  ఇచ్చి, వారి అభిప్రాయాలను గౌరవించి, తన మేధస్స్తు తో 'ఇండియన్ పీనల్ కోడ్' డాక్యుమెంట్ ను  తయారు చేశాడు. 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ చిత్తుప్రతి, మూల రూపం,  నేటికీ చెక్కు చెదరలేదు.  దీనిమీద కొన్ని విమర్శలు ఉన్నప్పటీకీ, ఈనాటికీ, న్యాయశాస్త్రంలో, దీనికి తిరుగు లేదు.
పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా పాకిస్తాన్ తన దేశంలో అమలు చేసింది.  దాని పేరు పాకిస్తాన్ పీనల్ కోడ్ (పి.పి.సి).  బంగ్లాదేశ్ కూడా బంగ్లాదేస్ పీనల్ కోడ్ పేరుతో అమలు చేసింది. బ్రిటిష్ వలస దేశాలైన, మియన్మార్ (నాటి బర్మా), శ్రీలంక (నాటి సిలోన్, మలేసియా, సింగపూర్, బ్రూనీ దేశాలు కూడా మన ఇండియన్ పీనల్ కోడ్ ని యధాతధంగా అమలు చేస్తున్నాయి.
లార్డ్ మెకాలే తయారుచేసిన ' డాక్యుమెంట్ ' ని,  నాటి ఛీఫ్ జస్టిస్ సర్ బార్నెస్ పీకాక్, కలకత్తా సుప్రీమ్ కోర్టు న్యాయాధిపతి అయిన ఇతను నాటి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా కూడావున్నారు. ఇతను ఈ డాక్యుమెంట్ ని  సునిశితంగా, సుదీర్ఘంగా, పరిశీలించి, పరీక్షించాడు. వారి పరిశీలన తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ 6 అక్టోబర్ 1860 నాడు చట్టసభ ఆమోదం పొందింది. దురదృష్టవశాత్తు, ఇండియన్ పీనల్ కోడ్ సృష్టికర్త లార్డ్ మెకాలే తన కృషి, చట్టమై , అమలు జరగటం ఛూడలేకపోయారు . కారణం మెకాలే 28 డిసెంబరు 1859 న, తన 59వ ఏట, మరణింఛాడు.  ఇండియన్ పీనల్ కోడ్ 1837 లోనే నాటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ - కౌన్సిల్ కి నివేదించినా, 1860 సంవత్సరం వరకూ అది వెలుగు చూడలేదు. 1830 కి ముందు, భారత దేశంలో, 'ది ఇంగ్లీష్ క్రిమినల్ లా', అనేక చట్ట సవరణలతో, నాటి ప్రెసిడెన్సీ టౌన్ లలో (బొంబాయి, కలకత్తా, మద్రాసు అమలు జరిగేది.
ఈ ఇండియన్ పీనల్ కోడ్ ప్రపంచము మొత్తం  కుగ్రామంగా మారినా, జీవితం వేగవంతమైనా, సమాజాలు మారుతున్నా, ప్రపంచమే మారిపోతున్నా కూడా, 150 సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా, ఉన్నది అంటే, మెకాలే దూరదృష్టి. అతని మేధస్సు అనితర సాధ్యం. మరో పది దేశాలకు కూడా తన గ్రంథం ఆయా దేశాలకు వేదం, బైబిల్, ఖురాను,జెండ్ అవెస్తా అయ్యింది.  ఇది విశేషమే కదా.  ఇండియన్ పీనల్ కోడ్ చరిత్ర వెనకాల చాలా మంచి విషయాలు వున్నాయి కదా. 

శనివారం, అక్టోబర్ 03, 2015

బెర్లిన్ గోడ

శనివారం, అక్టోబర్ 03, 2015

 ఈ రోజు జర్మనీ చరిత్రలో .అసలు ప్రపంచ చరిత్రలోనే మరిచిపోలేని రోజు. జర్మనీని తూర్పు, పశ్చిమ జర్మనీలుగా విడగొడుతూ మధ్యలో నిర్మించిన గోడను కూల్చేసిన సంఘటనకు నేటితో సరిగ్గా 26 సంవత్సరాలు పూర్తైయ్యాయి.  
బెర్లిన్ గోడ జర్మనీ రాజధాని బెర్లిన్ లో ప్రసిద్ధిగాంచిన గోడ. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు మరియు పశ్చిమ జర్మనీలను వేరుచేస్తూ నిర్మించబడింది. దీనిని ఐరన్ కర్టన్ అని కూడా పిలుస్తారు. యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత అమెరికా, రష్యాలు దాన్ని రెండు భాగాలు చేశాయి. రష్యా ఆధిపత్యంలో తూర్పు జర్మనీ, అమెరికా ఆధిపత్యంలో పశ్చిమ జర్మనీ ఉండేవి.  తూర్పు జర్మనీనుంచి పశ్చిమ జర్మనీలోకి జనం వలసలు వెళ్ళకుండా కట్టుదిట్టం చేయడం కోసం తూర్పు జర్మనీ కమ్యూనిస్టు పాలకులు సరిహద్దుల్ని మూసివేయ నిర్ణయించి రెండింటికీ అడ్డుగా ఈ గోడ నిర్మాణం ఆగష్టు 13, 1961 ప్రారంభమైనది. 
ఈ చర్య తూర్పు పశ్చిమ జర్మనీలలోని ప్రజల్లో గొప్ప వేదన కలిగించింది. కొంతకాలం గడిచిన తర్వాత తూర్పునుంచి ఆ గోడను దాటడానికి యత్నించిన 136మందిని తూర్పు జర్మనీ భద్రతా దళాలు కాల్చిచంపాయి. వేలమందిని అదుపులోకి తీసుకొని జైలు పాలుజేశాయి. జర్మనీ దేశాలు రెండూ ఏకమైతున్నాయని తీర్మానించిన రోజు నవంబరు 9, 1989, ఒక పండుగ రోజులాగా జరుపుకున్నారు. తరువాత కాలంలో ఈ గోడను నెమ్మదిగా చిన్న చిన్న భాగాలు ప్రజలే తొలగించడం మొదలుపెట్టారు. మిగిలిన భాగాన్ని ప్రభుత్వ యంత్రాంగం తొలగించింది.  ప్రచ్చన్న యుద్ధానంతరము, బెర్లిన్ గోడ కూల్చివేయడం వలన, ఈ నగరము తిరిగి ఒక నగరము ఆయెను. బెర్లిన్ నగర జనాభా సుమారు 35 లక్షలు మంది.
బెర్లిన్ గోడ తొలగింపుతో జర్మని విలీనం అక్టోబర్ 3, 1990 లో పూర్తయింది.

శుక్రవారం, అక్టోబర్ 02, 2015

"జై జవాన్ - జై కిసాన్ - జై భారత్"

శుక్రవారం, అక్టోబర్ 02, 2015

ఈ రోజు గాంధి గారి పుట్టినరోజు అని మాత్రమే కాదు ఈ రోజు న భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు .   ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న శారదా ప్రసాద్, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు.  ఈయన నినాదం "జై జవాన్ - జై కిసాన్ - జై భారత్".  శాస్తిగారు మంచి మనసుతో దేశాభివృద్ది కోసం పోరాడిన మహామనీషి, అంతేకాదు గొప్ప స్వాతంత్ర్య సమరయోదుడు,  అస్సలు గర్వంలేకుండా అందరి మనస్శులు గెలిచిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్తిగారు. గాంధిగారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలోను , సత్యాగ్రహము లోను పాల్గొనుటకు ఉత్సాహంగా వుండెవారు . అప్పుడు జైల్లోకూడా స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు.
స్వాతంత్ర భరత దేశానికి నెహ్రు మొదటి ప్రదాని , నెహ్రు తరువాత లాలబహదుర్ శాస్త్రిగారు రెండవ ప్రదాని గా ప్రమాణ స్వీకరము చేసారు.
ఆయన. 1965 యుద్ధంలో పాకిస్తానును కాళ్ళబేరానికి తీసుకువచ్చాడు. తాష్కెంటు లో పాకిస్తానుతో సంధి చర్చలకు వెళ్ళినపుడు 1966 జనవరి 11 న గుండెపోటుతో మరణించాడు. మరణానంతరం ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. 
లాల్ బహదుర్ శాస్త్రి గారి జన్మదినము సందర్బముగా నివాళి అర్పిద్దాం మరి. 

అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.

ప్రపంచ అహింసా దినోత్సవం (లేదా అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ఆంగ్లం: International Day of Non-Violence) గా మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబరు 2వ తేదీని పాఠిస్తారు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ (అక్టోబరు 21869 - జనవరి 301948) భారతీయులందరిచే ఆదరింపబడే ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ప్రజలు ఆయనను జాతిపిత గా గౌరవిస్తారు. సత్యముఅహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు.  20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యధికముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను కేబుల్ న్యూస్ నెట్వర్క్(CNN) జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నికగన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు. ఈ రోజుని ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జూన్ 15, 2007న అమోదించింది. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి అనేక ఉద్యమాలను నడిపాడు సత్యాగ్రహము పాటించాడు. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి అనేక ఉద్యమాలను నడిపాడు సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ మరియు ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. గౌతమ బుద్ధుడు ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, యేసు క్రీస్తు అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం. సాంప్రదాయ పద్దతిలో జరిగే హింసాయుత లేదా అహింసాయుత పోరాటంలో ప్రత్యర్థిని ఓడించడం, లేదా ప్రత్యర్థి తన లక్ష్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, లేదా ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్నవి ముఖ్యాంశాలు. కానీ సత్యాగ్రహ విధానంలో తప్పు చేసే వారిని బలవంతంగా ఆపకుండా వారిలో మార్పును తీసుకురావడం ముఖ్య లక్షణం.
బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగానిలచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొని  బాపూజీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని  గడగడలాడించడంతో భారత దేశాకి స్వాతంత్య్రం లభించింది. కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటం ఫలితంగా స్వాతంత్ర్యాన్ని పొందిన ఘనత కేవలం భారతదేశాకి మాత్రమే దక్కుతుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన గాంది  తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్ధానాన్ని సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఐక్యరాజ్య సమితి కూడా మహాత్మడి జన్మదినోత్సవ్నా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం భారతీయులకు ఎంతో గర్వ కారణం.  
అహింసా అంటే ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టము లేని కార్యాన్ని బలవంతంగా చేయించి, తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాక్కాయ కర్మలచేత బాధ కలిగించడం హింస. సర్వకల సర్వావస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస. 
హింస మూడు రకాలు: మానసిక హింస, వాచిక హింస మరియు కాయిక హింస. 
పరులకు హాని తలపెట్టడం, మనో నిగ్రహం లేకపోవడం, పాపభీతి లేకుండా ప్రవర్తించడం అనేవి మానసిక హింస. అసత్యాన్ని పలకడం, అహితముగా లేదా కఠినంగా మాట్లాడడం వాచిక హింస. 
ఒక జీవిని చంపడం, గాయపరచడం, దుష్క్రియలచేత పీడించడం, పరస్త్రీ సహవాసం, పరధనాపహరణం, మాంస భక్షణ కాయిక హింస అనబడతాయి.

అహింసా పరమో ధర్మః అహింసా పరమం తపః
దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి.

"జీవో జీవస్య జీవనమ్" - అనగా ఒక జీవి మరొక జీవిని చంపి తనడం జంతు ప్రవృత్తి.

అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం,తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం దైవ గుణ సంపద, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు మొదలైన భావాలు దైవం వల్లనే కలుగుతాయి.ధర్మాలు అన్నింటిలో అహింస శ్రేష్ఠమైన ధర్మం. భూతదయను మించిన పుణ్యం, హింసను మించిన పాపం లేదని వేదోపనిషత్తులు చెబుతున్నాయి.
అహింస మహావిష్ణువునకు ప్రీతికరమైన ఎనిమిది పుష్పాలలో మొట్టమొదటిది. అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, సహనం, శాంతం, తపస్సు, ధ్యానం,సత్యం అనేవి ఈ ఎనిమిది పుష్పాలు.  ఈ ఎనిమిది కలిగినవారు చాలా గోప్పవారవుతారు.  ఏది అయినా సరే సాధించగలరు. అలా సాధించి చూపినవాడు మహాత్మా గాంది.  గాంధీగారి జన్మదినము సందర్బంగా ఆయనకు మనస్పూర్తిగా నివాళి అందిస్తూ.  అంతర్జాతీయ సత్యాగ్రహ మరియు అహింసాదినోత్సవ శుభాకాంక్షలు. 
జై హింద్ 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)