Blogger Widgets

గురువారం, ఫిబ్రవరి 15, 2024

అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆదిదేవుడు సూర్యనారాయణ మూర్తి

గురువారం, ఫిబ్రవరి 15, 2024

 నమస్కారిస్తే ఆయురారోగ్యాలుఅర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.  


ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

2. సప్తాశ్వరథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజం |

శ్వేతపద్మధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

3. లోహితం రథమారూఢం – సర్వలోకపితామహం |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

4. త్రైగుణ్యం చ మహాశూరం – బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్‌ |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

5. బృంహితం తేజసాంపుంజం – వాయు రాకాశ మేవ చ |

ప్రియంచ సర్వలోకానాం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

6. బంధూకపుష్పసంకాశం – హారకుండభూషితం |

ఏకచక్ర దరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

7. తం సూర్యం లోకకర్తారం – మహాతేజ: ప్రదీపనమ్‌|

మహాపాపహరం దేవం- తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

8. తం సూర్యం జగతాం నాథం – జ్ఞానప్రకాశ్యమోక్షదమ్‌ |

మహాపాపహారం దేవం – తం సూర్యం ప్రణ మామ్యహమ్‌.

9. సూర్యాష్టకం పఠేన్నిత్యం – గ్రహపీడా ప్రణాశనం |

అపుత్రో లభతే పుత్రం – దరిద్రో ధనవా న్భవేత్‌ |

10. ఆమిషం మధుపానం చ య: కరోతి రవేర్ధినే|

సప్త జన్మ భవేద్రోగి – జన్మ జన్మ దరిద్రతా |

స్త్రీ తైలమధుమాంసాని – యే త్యజంతిరవేర్దినే |

న వ్యాధి: శోకదారిద్య్రం – సూర్యలోకనం చ గచ్ఛతి.

ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరుణించు  . ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.

మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని

"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి  అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు . 
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.

శనివారం, ఫిబ్రవరి 03, 2024

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం

శనివారం, ఫిబ్రవరి 03, 2024

 మనం జీవితంలో ఎన్నో అనుకుంటూ వుంటాం.  కొన్ని పనులు అనుకోగానే అవుతాయి కొన్ని పనులైతే ఎన్నిసార్లు చేపట్టినా అవ్వదు.  అలాంటప్పుడు మనకి నిరాశా నిస్పృహ వస్తాయి.  కొంతమంది అయితే డిప్రషన్లోకి వెళ్ళిపోతారు.  అంతలా చేస్తాయి  నిరాశా నిస్పృహ .   మనం వింటు వుంటాం ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం వుంటుంది అని.  మనం ప్రయత్నిస్తూ వుండాలి అంతే. 

కృష్ణుడు భగవద్గీతను అర్జునికి ఒకనికే చెప్పలేదు.  మనకోసం చెప్పివుంటాడేమో .  ఇప్పుడు అందరు ఏదన్న సమస్య వస్తే మానసిక వైద్యునిదగ్గరికి వెల్తూన్నారు. వాళ్లు కౌన్సిలింగ్స్ ఇస్తారు.  అలాగే యుద్దభూమిలో అర్జునుడు తనవారిని చూసి యుద్దం చేయను, చేయలేను అంటూ అర్జుని విషాధం దానితరువాత శ్రీ కృష్ణులువారు భగవద్గీత చెప్పారు.  అయితే మనజీవితంలో అన్వయించుకుంటే    ప్రతీ సమస్యకి భగవత్గీతలో సమాధానం దొరుకుతుంది.  చూసే దృక్కోణం బట్టి సమాధానం వుంటుంది. 

ఈరోజు ఒకసమస్యని చూసి గీతలో కృష్ణుడు ఏమి చెప్పారో చూద్దాంరండి. 

సమస్య ఏమిటంటే :  

ఒకపని తలపెట్టాను. ఆపని ఎన్నిసార్లు చేసినా పూర్తీ అవ్వటంలేదు.. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావటంలేదు. కష్టం వృధా అవుతొంది తప్పా మంచి ఫలితం రావటంలేదు.  మనస్సులో ధైర్యంలేదు. నేను ఏమి చేసినా ఇంతే .  ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది . ఏమి చేయాలన్నా భయం నేను చేయగలనా లేదా. ఒకవేళ చేస్తే పర్ఫెక్ట్ అవుతుందో లేదో .  మనసునిండా tension .  మనసు కృంగిపోతుంది.  

ఈ సమస్య సర్వసాధారణంగా మనలో చాలామంది అంటూ ఉంటారు. మనం వింటూనే వున్నాం కదా మరి ఈ సమస్యకి గీత ఏమి చెప్తోందో చుద్దాం.  

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం. 


 గీతలో సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చూడండి. 

||శ్లోకము 2-3||

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరన్తప ||3||

చూడండి. దీని అర్ధం ఏమిటంటే 

“  పార్థా ! పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ; అది నీకు ఎంత మాత్రమూ తగదు ; తుచ్ఛమైన హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా ! ”

హృదయ దౌర్భల్యం, పిరికితనం, అధైర్యం వంటివి మన మనసున చేరిన బుద్ది నశిస్తుంది. విచక్షణ జ్ఞానము ఉండదు. 

అందువల్లే ఎంతో గొప్ప సాటిలేని వీరుడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక,అంతిమలక్ష్యం వైపు దృష్టిపెట్టాలి.  విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం . ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం.జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూంటేగమ్యం చేరువ అవుతూ ఉంటుందిచివరికి లక్ష్యాన్ని చేరుతాం . 

పరిష్కారం : ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు. నీశక్తి నీలోనే ఉంది . అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఇప్పటికే చాలా విజయాలు సాధించావు అలాంటి నువ్వా ఇలా క్రుంగిపోతున్నావా ? లే  దైర్యం తెచ్చుకో .  నీచమైన పిరికితనం వదిలిపెట్టు . ఉత్సాహంతో దైవంమీద భారం వేసి పని మొదలు పెట్టు. తప్పకుండా విజయం సాధిస్తావు. 

ఇదండీ భగవద్గీతలో మన సమస్యకి సాంఖ్యా శాస్త్రంలో సమాధానం దొరికింది.  మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. 

బుధవారం, డిసెంబర్ 15, 2021

సిరినోము చేసే సమయం వచ్చింది (మార్గళి త్తింగళ్ పాశురము)

బుధవారం, డిసెంబర్ 15, 2021

  ధనుర్మాసం మొదలు  అయ్యింది కదండి. ఈ నెలరోజులు పాశురాలు పాడతాము కదా.  అయితే మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.

గోపికలును గోదాదేవి ఈ వ్రతం గురించి ముందుగా వారు మార్గశిరమాసం గురించి ఆ వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు.  తరువాత ఈ వ్రతం ఎవరు చేస్తారో దాని వల్లన కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు.  ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.  
                                    మొదటి పాశురం లో మనకు  నారాయణ తత్వము కనిపిస్తుంది. 

మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .
పాశురం తాత్పర్యము:  
ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజులు  . ఓ! అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ! బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్న సంకల్పమున్నచో రండు. ముందునడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపదరాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించని మనకే , మనమాపేక్షెంచు వ్రతసాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరు సంతోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము.

సిరినోము  చేసే సమయం వచ్చింది 

సిరినోము 

రారమ్మా ఓ అమ్మలారా! రారే మమ్మ!
నీరాడ మనసున్నవారు, మీరూ  మీరూ !
శ్రీరమ్యమైన మన వ్రేపల్లెలోన
చేరి, కన్నియలార! కూరిమి చెలులార !   !!రారమ్మ !!  

ఇది మార్గశిరము , వెన్నెలవేళ , భాసురము !
ఇది పరవాద్య వ్రతారంభ వాసరము !
మదిలోన జగమెల్ల ముదమంది పొగడ ,
కదిసే కంకణ కటక కింకిణులు కదల  !! రారమ్మ !!

మరీమరీ కనికనీ మెరిసేటి కనులతో 
మురిసే యశోదమ్మ ముద్దు సింగపుకొదమ,
కరిమొయిలు మెయిహోయలు  గల అందగాడు,
వరదుడౌ మనరేడు వ్రతమేలువాడు !! రారమ్మా !!

కరమందు కరకువాల్ కాపుగా దాలిచి 
వారాలేటి మేటినందుని నందనుండు 
అరుణశశిబింబనిభ శుభవదనుడు 
సరసిజాక్షుడే నోము కరుణింపగా !! రారమ్మ !!

ఆదివారం, నవంబర్ 15, 2015

పాహిపాహి సర్పరూప

ఆదివారం, నవంబర్ 15, 2015



"కర్కోటకస్య నాగస్య దమయంతీ నలస్యచ 
ఋతుపర్ణంచ రాజర్షి కీర్తనం కలినాశనం"





పాముని చుడగా బెదిరి చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం 
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయుగా అవిదేముడే ! కోల్వుడీ ప్రజల్

మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా.  దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి.  ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.  నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.  ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.  నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
లా "నాగుల చవితి రోజున ప్రత్యక్షముగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే ..మానవునిలో ఉన్న "విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,మన అందరి హృదయాలలో నివశించే "శ్రీ మహా విష్ణువు నకు" తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాంపుగా" మారాలనికోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయిటలలోగలాంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్యపరంగా చుస్తే...కుజ,రాహు దోషాలున్న వారు, సాంసారిక బాధలు ఉన్నవారు, ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ ,చతుర్దశలలో రోజంతా ఉపవాశము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరించాలి.

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా!

నాగులు  చవితి  రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి. 
పాము పుట్ట లో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు 
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.  నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.  ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు. 
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

ఆ ప్రకృతిని మానవుడు చెజేతులార నాశనం చేసుకుంటే, ఇటు మానవ కోటికి, అటు జీవ కోటికి తప్పక వినాశనానికి దారితీస్తున్నందున భావముతో నేడు ప్రకృతిని - పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్ర
అలాగ ప్రకృతిని మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపముగా భావించి ఆనాటి నుండి నేటి వరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలాగ సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపముగా చూసుకుంటు పూజిస్తు వస్తున్నారు.

అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత!

అలా మనకంటికి కనబడే విషనాగుపాము కంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. 
ఈ మానవ శరీరము అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెమూకను "వెన్నుపాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తూన్నట్లు ,కామ, క్రోధ, లోభ,మోహ,మద,మత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో "సత్వ గుణ" సంపట్టిని హరించివేస్తూ ఉంటుంది.

యుగాల నాటిది. సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల సరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎనో గాధలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి.

ఈ "నాగుల చవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం .

నాగేంద్రా ! మేము మా వంశములో వారము నిన్ను ఆరధిస్తున్నాము. పొరపాటున "తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడు అనుకో! పడగ త్రొక్కితే కస్సుబూసుమని మమ్మల్ను భయ పెట్టకు తండ్రి ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు అంటారు.

ఈ నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది అని శస్త్రాలు పేర్కుంటున్నాయి. 

"కర్కోటకస్య నాగస్య
దమయంత్యా నలస్య చ 
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తినం కలినాశనం

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు, మొదలైనవి ప్రీతికరమైనవి అని చెప్తారు.

సర్పారధనచేసే వారి వంశం "తామరతంపరగా" వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్ణ్యేశ్వరుడే! 


నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నయని,గరళన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలాగ ప్రకృతిలో నాగు పాములకు ,మానవ మనుగడులకు అవినవ భావ సంబంధం కలదని విదితమవుతోంది.

ఈరోజు నాగుల చవితి సందర్భముగా అందరికి నాగులు చవితి శుభాకాంక్షలు. 

మంగళవారం, అక్టోబర్ 27, 2015

వాల్మీకి జయంతి

మంగళవారం, అక్టోబర్ 27, 2015

వాల్మీకి జయంతి 27/10/2015.
వాల్మీకి సంస్కృత సాహిత్యం మొదటి కవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని  మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు.  అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.  వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది.   శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని  కలుసుకున్నారు.  వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు  సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు  రామాయణం బోధించాడు.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ,  అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. 
ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు.  ఆపేరు నిలిచిపోయింది.  వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. 

వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం అంతా  రాసేవరకూ సాగింది. మొదట  శ్లోక రచన చేసింది వల్మికినే. 
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ. 

బుధవారం, అక్టోబర్ 14, 2015

బ్రహ్మచారిణి

బుధవారం, అక్టోబర్ 14, 2015

దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.
హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.
ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.
బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.
దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమెకృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

శనివారం, మే 09, 2015

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా

శనివారం, మే 09, 2015

కలియుగ ప్రత్యక్ష దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32 వేల సంకీర్తన కుసుమాలతో అర్చన చేసి తరించిన పరమ భగవత్ భక్తుడు, తోలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు.   ఈయన జన్మదినము నేడే.  15 వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య తల్లితండ్రులు శ్రీమతి లక్కమాంబ, శ్రీ నారాయణ సూరి దంపతులకు వారి  తపః ఫలితంగా వేంకటేశుని దివ్య అనుగ్రహం వలన జన్మించినాడు అన్నమయ్య .  క్రీ. శ 1408 వ సంవత్సరం లో మే నెల 9 వ తారీకున జన్మించారు.  మనం తెలుసుకున్న  తెలుగులో మొట్టమొదటి పదాలు అన్నమయ్యవే.  
అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డ గోరుముద్దలు తినిపిస్తూ పాడుతున్న పాట 
 " చందమామ రావో జాబిల్లి రావో , మంచి 
    కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో"   
ఆహా ఎంత అద్బుతంగా వుందండి ఈ పాట అంతే కాదు నిదిరించే వేళ  అమ్మ పాడిన జోల పాట 
"జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో"
ఆయన ఏ పాట రాసిన పూర్తిగా అనుభూతి పొంది రాసిన పాటలు లో ఒకటి అన్నమయ్య స్వయంగా అనుభూతి పొందిన పాటలు. చిన్ని కృష్ణుని గురించి ఆలోచిస్తూ మేలుకొలుపు పాట ఒకటి ఇదిగో 

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా 
సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా ||

ఆవులు పేయలకు గానఱచీ బిదుకవలె 
గోవిందుడయింక మేలుకొనవయ్యా 
ఆవలీవలిపడుచులాటలు మరిగి వచ్చి 
త్రోవ గాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా || 

వాడల గోపికలెల్లా వచ్చి నిన్నుముద్దాడ
గూడియున్నారిదే మేలుకొనవయ్యా 
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము 
ఈడకు దెచ్చి పెట్టెనిక మేలుకోవయ్యా ||

పిలిచీ నందగోపుడు పేరు కొనియదె కన్ను -
గోలుకులు విచ్చి (ఇంక) మేలుకొనవయ్య 
అలరిన శ్రీ వేంకటాద్రిమీద బాలకృష్ణ
యిల మామాటలు వింటివిక మేలుకోవయ్య || 

అన్నమయ్య పై సంకీర్తన ద్వారా యోగనిద్రలో మునిగియున్న ఆ గోపబాలుని మేలుకొలుపుతున్నారు.    

నీ ఆటలు, యోగనిద్రా కట్టిపెట్టవయ్యా ! ఆవులు దూడలకు పాలిచ్చువేళ అయినది. అవి అంబారావం చేస్తున్నవి. పాలు పితికే వేళ అయినది. నీ తోటి గోప బాలురందరూ, నీతో ఆటలాడుటకు నీ వాకిట వచ్చి చేరి యున్నారు. గోపికా మణులు నీపై వ్యామోహంతో నిన్ను ముద్దులాడు వచ్చి యున్నారు. నీవు ఆరగించుటకై, నీ తల్లి యశోదమ్మ వాత్సల్యంతో బంగారు గిన్నెలో పెరుగన్నం తెచ్చి నీ చెంత నిలచి యున్నది. మేల్కొనవయ్యా ! గోపరాజైన నీ తండ్రి, నందుడు నిన్ను చేరి పిలుస్తున్నాడు.
నందరాజునకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. శ్రీకృష్ణునకు అసురులవలన ఎపుడు ఆపద కలుగుతుందో అన్న భయంతో, నందుడు ఎల్లపుడూ చేతిలో వేలాయుధం ధరించి రక్షకుడుగా ఉంటాడట. శేషగిరిలో నెలకొన్న ఓ బాలకృష్ణా ! విశాలమయిన నీ పద్మనయనములను తెరచి మమ్ము కృపతో ఏలుకోవయ్యా ! 

ఎంత అద్బుతంగా రాసారండి.  అన్నమయ్య జన్మదినము రోజు ఇంత మంచి పాటను పంచుకుంటుంన్నందుకు చాలా సంతోషంగా వుంది.  అన్నమయ్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. 

శనివారం, ఏప్రిల్ 18, 2015

వటపత్ర శాయి కధ

శనివారం, ఏప్రిల్ 18, 2015

కరార విందేన పదార విందం
ముఖార విందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయంతం
బాలం ముకుందం మనసా స్మరామి

పద్మం వంటి తన పదాన్ని,పద్మంవంటి చేతితో, పద్మంవంటి నోటిలో చోప్పిస్తూ మర్రి ఆకుదొన్నెలో శయనించియున్న బాలముకుందునికి మనసా నమస్కరిస్తున్నాను.   
మర్రి ఆకు మీద శయినించిన  భగవానుడు శ్రీ కృష్ణులు.   పద్మము వంటి పదాన్ని పద్మం వంటి చేతితో నోటిలో పెట్టుకొని మధువును చప్పరిస్తూ కనిపిస్తారు.  ఈ వృత్తాంతం మనకు మార్కండేయ మహర్షి చరిత్ర లో కనిపిస్తుంది.  మార్కండేయుడు 6 మన్వంతరములు మహా విష్ణువుకోరకు ఘోరమైన తపస్సు చేస్తాడు.  మార్కండేయుని తపస్సు తన ఉనికికే సమస్యగా మారుతుందనుకొని మహేంద్రుడు అప్సరసలును  పంపి తపస్సు భగ్నం చెయ్యటానికి ప్రయత్నించాడు.  కానీ ప్రయత్నాలన్నీ వృదాయ్యాయి.  మార్కండేయుడు ఈ మాత్రం చలించకుండా తపస్సు చేస్తూనే వున్నాడు.  మహావిష్ణువు ప్రత్యక్షం అయ్యి మార్కండేయ నీ తపస్సుకు కారణం ఏమిటి. నీకు ఏమి వరం కావాలి అని ప్రశ్నించాడు మహా విష్ణువు.  అప్పుడు మార్కండేయుడు దేవా నీ మాయని చూడాలని వుంది అన్నాడు.  కొన్నాళ్ళకు మహా ప్రళయం వచ్చింది.  ప్రచండమైన గాలి, వర్షం.  నదులు, సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి.  భూమితో పాటు సమస్తం నీటిలో మునిగిపోయాయి.  మార్కండేయుడు విష్ణుమాయవల్ల నీటిలో తేలియాడుతూ తిరుగుతుండగా ఒకప్రదేశంలో మర్రి ఆకుమీద శయనించి వున్న చిన్న శిశువు  నోటిలో కాలివేలు పెట్టుకొని చీకుతూ  కనిపించాడు.  అతనే వటపత్ర శాయి. 
మహా విష్ణువు ఆదేశంతో మర్రి ఆకు పై వున్నా  వటపత్ర శాయి కడుపులోకి వెళ్లి చూస్తాడు.  నీట మునిగిన సమస్త భూమి, ప్రాణి కోటి కానిపిస్తుంది.  మహావిష్ణువు మరలా ఇంకొకచోట సమస్త ప్రాణులను సృస్తిస్తాడని మార్కండేయుడు తెలుసుకుంటాడు.  ఈ విధంగా మహా విష్ణువు మాయను తెలుసుకున్నాడు మార్కండేయుడు.    

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)