Blogger Widgets

గురువారం, డిసెంబర్ 24, 2015

జై దత్త శ్రీ గురుదత్త

గురువారం, డిసెంబర్ 24, 2015

శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షిఅనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.
అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.
ఆ పతివ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి.  దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయారూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి. 
మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి. దీనిని దత్త జయంతి గా వ్యవహరిస్తారు, దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి , కుక్కల పండగగా వ్యవహరిస్తారు . ఈ రోజు కుక్కలకు సజ్జ బూరెలు, తెప్పాల చెక్కలు ఆహరం పెట్టటం సాంప్రదాయం .  దత్తాత్రేయుడు నాథ సంప్రదాయంలో ఆది సిద్ధుడు గా గుర్తించబడ్డాడు.
ఉద్ధవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతం పొందుపర్చబడింది. దత్తాత్రేయుడి గురించి కృష్ణుడు చేసిన గీతాలాపనపై ఓ కథ ప్రచారంలో ఉంది, దీంట్లో కృష్ణుడు దత్తాత్రేయుడి ఇరవై-నాలుగు గురువుల జాబితాను పేర్కొన్నాడు: భూమి, గాలి, ఆకాశం లేదా ఖగోళం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, నాగుపాము, రామచిలుక, సముద్రం, చిమ్మట, తేనెటీగ, మదపుటేనుగు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వేశ్య, లోహపు పనివాడు, సర్పం, సాలీడు మరియు కందిరీగ. దత్తాత్రేయుడి 24 గురువులు పురాణంలో వర్ణించబడిన అవధూత్ యొక్క 24 గురువులనుంచి వచ్చారు. 
శ్రీ శ్రీ శ్రీ గురు దత్తాత్రేయులవారి జన్మదిన శుభాకాంక్షలు. 

ఆదివారం, డిసెంబర్ 20, 2015

వైకుంఠ ఏకాదశి - గీతా జయంతి

ఆదివారం, డిసెంబర్ 20, 2015



              హిందువుల పండుగలలో వైకుంఠ పదంతో రెండు ఉన్నాయి. ఒకటి వైకుంఠ చతుర్దశి, రెండు వైకుంఠ ఏకాదశి. అయితే ఈ రెండు పర్వాలు ఆంధ్ర ప్రాంతంలో వేరుపేర్లతో పిలుస్తారు.
వైకుంఠ ఏకాదశిని ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌర మాన ప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్రమణం, మకరసంక్రమ ణం మున్నగు పర్వాలవలె ఇది కూడ సౌరమానాన్ననుసరించి తెలుగు వారు జరిపే పండుగలలో ఒకటి. ధనుస్సు నెల పట్టిన తరువాత శుద్ధంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరంలో కాని, పుష్యంలో గాని వస్తుంది.  ఇది వైష్ణవులకు, రామానుజ, మాధ్వమతస్థులకు చాలా ముఖ్య మైనది. అయినప్పటికీ దీనిని అందరూ ఈ ముక్కోటి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తారు. పంచాగ కర్తలు ఈనాటి వివరణలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శ్రీరంగద్వారస్థ భగవదాలోకన మహోత్సవం అని వ్రాస్తారు. 
ఒకటి స్వర్గ ద్వారం, రెండు ముక్కోటి, మూడు వైకుంఠం. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో నిర్యాణమైనవారు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణంచేత ఈ పండుగకు దక్షిణా దిని కొన్ని ప్రాంతాలలో స్వర్గ ద్వారం అనే నామం కూడా ఉంది.  ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.  
ఈ రోజుకు  ఇంకోప్రత్యేకత వుంది అదేంటి అంటే ఈ రోజునే గీతజయంతి. 
మహాభారతంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే గీత.  గీతలో మొదటి శ్లోకం
ధృతరాష్ట్ర ఉవాచ: 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | 
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
అనే విషయంతో మొదలవుతుంది భగవద్గీత.  
హిందూ పవిత్ర గ్రంధం భగవ​ద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా మార్గశిర ​శుద్ధ ఏకాదశి  రోజు జరుపుకొంటారు.  ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు.   భగవత్ గీత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ భూమి లో ఉపదేశిస్తాడు.అన్ని సంధి ప్రయత్నాలూ విఫలమైన తర్వాత, యుద్ధం ప్రకటిస్తారు పాండవులు. సంగ్రామ భూమిమీద అడుగు పెట్టిన తర్వాత ఆ మహా సైన్యం చూసి, వారిలో తన తాత అయిన భీష్ముడు వంటి వారిని చూసి నేను యుద్ధం చేయలేను అని అస్త్త్రాలు విడిచి పెట్టాడు.  అప్పుడు శ్రీ కృష్ణులు వారు గీతోపదేశం చేసారు. దాని సారం శాంతి. కృష్ణుడు అర్జునుడుతో ఇలా ఇన్నారు.
మిత్రమా !ఎందుకు భాధపడుతున్నావు !అయ్యిందేదో అయ్యింది . పొయిందేదో పోయింది .
ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదుకదా. వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజిలతో పొవాలనుకుంటున్నావు! అందుకే నీకంత యాతన. నువ్వేమి తెచ్చావని -నువ్వు పోగొట్టుకున్తున్నావు. నీవేమి సృస్తిమ్చావని నీకు నష్టం వచ్చింది? నువ్వు ఏదైతే పోదావో అది ఇక్కడనుండే పోదావు. ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడనుండే ఇచ్చావు.

ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం , రేపు ఇంకొకరి సొంతం కాగలదు.
కావున జరిగేది జరుగక మానదు . అనవసరంగా ఆందోళన చెందకు . ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపంలేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరించు అన్నారు.

సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.  అనటంలో ఎటువంటి సందేహం లేదు.
మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అదే అదృష్టంగా బావిస్తాము.  అన్నిటిలోనూ మనం అనుకున్నది జరగక పొతే అప్పుడు మనం అనుకుంటాం మనకు ఆ గీత రాసి లేదు అనుకుంటాము.  మన గీత లోనే వుంది భగవద్గీత.  అడితెలిసినవాడు ఎటువంటి భాధకు లోనుకాడు. గీతను శ్రీ క్రిష్ణులవారు ద్వాపరయుగం చివర లో అనగా కలియుగానికి ప్రారంబం లో జరిగింది.  జగత్గురు శ్రీ కృష్ణులు కార్తీక బహుళ అమావాస్యనాడు చెప్పారు.  ఉపనిషిత్తులు ను అవులుగాను,  అర్జునుని దూడగా చేసి శ్రీ కృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత.  గీతను అర్జునునికి శ్రీ కృష్ణుడు చెప్పిన గీత జ్ఞానం అంతా 18 అద్యాయాలుగా పరమపదసోపాన మార్గంగా విరాజిల్లుతోంది.  ఎవరు సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని ల క్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతాడు.  
వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. అందువల్ల భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు గీతను లోకానికి అందించాడు. గీత అనే పదంలో గీ అంటే త్యాగం, త అంటే తత్వజ్ఞానం. అంటే త్యాగాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.
గీతను మొదట  ఎవరు విన్నారంటే... శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజరూపంలో ఉన్న ఆంజనేయుడు.
గీతామహాత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే ఒకరి సతులతో ఒకరు గీతామహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. అదికూడా సాధ్యం కానివారు కనీసం పూజగదిలో ఉంచి పూజించాలి.
గీతాగ్రంథాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికీ ప్రయోజనకరమే. యజ్ఞం చెసిన ఫలం.  సమస్త  భూమండలాన్నీ దానం చెసినంత ఫలం.  గీతాగ్రందాన్ని పూజించిన దానం చెసినా ఎన్నొ  ఎంత పుణ్యం లభిస్తుందో, గీతాగ్రంథాన్ని పూజించినా, దానం చేసినా అంతే పుణ్యం లభిస్తుంది. సకల పుణ్యతీర్థాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, గీతాగ్రంథం ఉన్న వారి ఇంట భూతప్రేత రోగబాధలతో సహా దైవిక-దేహిక పీడలు తొలగిపోతాయి.
ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కాని జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి వంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం ఇదొకటే! కాబట్టి దీనిని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసమూ మరొకటి లేదని చెప్పవచ్చు.
భగవద్గీత మానవ సుఖ జీవన మంత్రంగా ఉపయోగించుకోవచ్చు.  ఇది నిజం. 
వైకుంఠ ఏకాదశి - గీతా జయంతి  శుభాకాంక్షలు. 

శనివారం, నవంబర్ 21, 2015

యాజ్ఞవల్క్య గురుదేవ నమోస్తుతే

శనివారం, నవంబర్ 21, 2015

కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవతారు అన్న విషయం అందరికి తెలుసు ఆవిషయాన్ని రుజువు చేసారు. కృషి ,పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు మారు పేరుగా వున్న మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి. ఈరోజు కార్తికశుద్ధ దశమి అంటే యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదినము.  నాకు ఋషులలో  చాలా ఇష్టమైన మహర్షి యాజ్ఞవల్క్యుడు.  ఎందుకు ఇష్టం అన్నది చెప్తా. ఆయన కధ  మీకు తెలుసుకోవాలని కుతూహలముగా వుంటుంది అని నాకు తెలుసు అందుకే మీకోసం యాజ్ఞవల్క్య మహర్షి కధ.
యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదిన శుభాకాంక్షలు. 
పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది. ఆ నగరంలోనే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్యపేరు సునంద. ఆ దంపతులిద్దరికీ జన్మించినవాడే యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడికి ఆయన తండ్రి సమయ సందర్భ కాలోచితంగా చెయ్యాల్సిన సంస్కారాలన్నీ చేయించాడు. దాంతో యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణవేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడి తండ్రి యజ్ఞవల్క్యుడు తన కుమారుడిని వైశంపాయన మహర్షి దగ్గరకు పంపాడు.  ఈ వైసంపాయన మహర్షి యాజ్ఞవల్క్య కి మేనమామ.  అతని దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆ వేదంతోపాటు మరింకా ఎన్నెన్నో విషయాలను గ్రహించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు. ఆ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయని అనుకున్నాడు ఆ గురువు. అయితే యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం పెరగసాగింది. అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదనపడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు. తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పినవాటినన్నింటినీ కక్కి వెళ్ళిపొమ్మని అన్నాడు. గురుద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసుకొన్నాడు. క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళిపోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు  కక్కిన దానిని  వైశంపాయుని శిష్యులు తిత్తిరిపక్షులుగా మారి  గ్రహించారు. అవి పలికె పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.  
గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్క్యుడు దిగాలుపడి కూర్చోలేదు. ఆత్మస్త్థెర్యంతో సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. అలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరుతెచ్చుకున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమశిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు. ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యుడికి ఆహ్వానం వెళ్ళింది. అలా మహర్షులందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యావంతులైతే వారొచ్చి ఇక్కడున్న ధనరాశులను తీసుకువెళ్ళవచ్చు అని గంభీరంగా అన్నాడు. అయితే రుషులంతా ఒకరిముఖాలు ఒకరు చూసుకొని తామందుకు అర్హులం కామనుకొంటూ ఊరకనే కూర్చున్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులను తన ఇంటికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. యాజ్ఞవల్క్యుడి ధైర్యాన్ని చూసిన అక్కడివారంతా అతడితో శాస్త్రవిషయాల్లో పోటీకి దిగి యాజ్ఞవల్క్యుడిని అనర్హుడిగా నిరూపించేందుకు ఎన్నోవిధాలుగా ప్రయత్నం చేశారుకానీ అవేవీ వారివల్లకాలేదు. దాంతో జనకుడు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించాడు. జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఓరోజున విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుడి దగ్గరకు వచ్చాడు. తత్త్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకొని యాజ్ఞవల్క్యుడంతటి గొప్పవాడు మరొకడు లేడని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. అనంతరకాలంలో ఆ ఋషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడికిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని వివాహమాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయంచేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలా చేసింది. కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలయ్యారు. ఆనాటి రుషులంతా యాజ్ఞవల్క్యుడిలోని విద్యావైభవాన్ని, యోగప్రాభవాన్ని గుర్తించి యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. ఆయన ప్రకటించిన యోగవిషయాలు యోగయాజ్ఞవల్క్యంగా ప్రసిద్ధికెక్కాయి. చివరలో భార్యలకు కూడా తత్త్వాన్ని ఉపదేశించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు.  ఇంతగొప్ప మహర్షి అయిన యాజ్ఞవల్క్య గురుదేవుల వారి పాదపద్మాలకు నమస్సులు తెలుపుకుంటున్నాను. యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదిన శుభాకాంక్షలు. 

శుక్రవారం, నవంబర్ 20, 2015

ఆంధ్ర జాలరి

శుక్రవారం, నవంబర్ 20, 2015

 జాలరి అంటే పడవ నడిపేవాడు అని అర్ధం.  ఆంద్రా జాలరి అంటే ఆచార్య డి.వై.సంపత్ కుమార్.  ఇదివరకు తెరచాప పడవకు గట్టిగా కట్టి గాలి వాటంతో నీటిమీద ప్రయాణం చేసేవారు లేదా చేపలు పట్టేవారు.   గాలి లేనప్పుడు పడవ సరంగులు పడవకు తాడు కట్టి కాలువ గట్టున నడుస్తూ లాగేవారు. బరువైన పడవల్ని అతి కష్టంగా అరుపులతో, కేకలతో పాటలతో పడవల్ని లాగే వారు. పాడుతూ లయప్రకారం అడుగులు వేస్తూ పాట  పాడుతూ కష్టం తెలియకుండా పడవను ఒడ్డుకుచేర్చేవారు . 
ఆంధ్రజాలరి గా ప్రఖ్యాతి వహించిన సంపత్కుమార్ జాలరి వేషం ధరించి 

ఉదయాన్నే లేచి ఎంతో సంతోషంగా చేపలు పట్ట టానికి తన నావతో సముద్రంలోకి వెళతాడు. 
చేపల కోసం గాలిస్తాడు. 
ఇంతలో కారు మేఘాలతో తుపాను కమ్ముకుంటుంది. 
పడవ వూగిపోతూ వుంటుంది. 
జాలరి మెలికలు తిరిగి పోతాడు. 
ఇంతలో ఒక పెద్ద చేప గాలానికి తగుల్కుని జాలర్ని అతలాకుతలం చేస్తుంది. 
అయినా పట్టు విడువని జాలరి పడవలో తల క్రిందులై పోతూనే ఎంతో కష్ట పడి ఆ చేపను ఒడ్డుకు చేర్చటం తుఫాను హోరు తగ్గి పోవటంతో విజయ వంతంగా ఆనందంతో గంతు లేస్తాడు. 

ప్రదర్శనానికి రంగ స్థలం తెరమీద బ్యాక్ ప్రొజక్ష్ణన్ తో సముద్ర హోరుని చూపిస్తారు. ఉరుముల్ని, మెరుపుల్ని లైటింగ్ తో జిగేలు మనిపిస్తారు. నేపద్య్యంలో సన్ని వేశాన్ని అనుసరించి తబలా ధ్వనులు అద్భుతంగా సహరిస్తాయి. ఈ కళా రూపాన్ని అత్యద్భుతంగా సృష్టించిన ఘనత సంపత్కుమార్కు దక్కుతుంది. ఈ కళారూపానికి సంబంధించిన పడవ పాటల్ని ప్రజా నాట్య మండలి రాష్ట్ర దళం జాతీయ సమైక్యతకు ఉపయోగించింది
పడవ సరంగులుగా, జాలరులుగా కొంత మంది వేషాలు ధరించి రంగ స్థలం మీద జాలరుల వేషాలతో గడ పట్టి పడవ నడపటం, చుక్కాని పట్టటం, తెర చాప ఎత్తటం మొదలైన అభినయాలతో విద్యార్థులు మొదలైన వారు అక్కడక్కడ ప్రదర్శించేవారు. కానీ ఈ జాలరి వేషాన్ని విజయనగరం కు చెందిన డి.వై.సంపత్ కుమార్ తన నాట్య ప్రదర్శనలతో పాటు ఈ వేషాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించారు. అవార్డుల నందుకున్నారు. ప్రజానాట్య మండలి కళాకారుడుగా ఈ కళా రూపాన్ని దేశ మంతటా ప్రదర్శించారు.  జాలరి నృత్యం అద్భుతమైన కళాఖండంగా చెప్పవచ్చు. నేడు  ఆచార్య డి.వై.సంపత్ కుమార్  గారి జయంతి సందర్బంగా జాలరినృత్యము గురించి తెలుసుకున్నాం. 

ఆచార్య డి.వై.సంపత్ కుమార్ ను ఆంధ్ర జాలరి గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ నృత్యములోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు.  ఈయన దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం మరియు సంగీతాలను ఏకీకృతం చేశారు. ఈయన ప్రముఖ వైణికుడు అయిన శ్రీ పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందారు. శ్రీ దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద భరతనాట్యం పై శిక్షణ పొందారు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతడు భరతనాట్యం , కూచిపూడి , యక్షగానం మరియు ఫోక్ నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టాడు. అయన కొన్ని వేల ప్రదర్శనలిచాడు. ఆయన అనేక రాష్ట్రాలలో నే కాకుండ వివిధ దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చాడు. 1954 మరియు 1999 ల మధ్య 45 సంవత్సరాలలో అతని అధ్వర్యంలో 60 మంది ప్రముఖ కళాకారులు ఆయన శిక్షణలో తయారైనారు.ఆయన ప్రముఖ నృత్య శిక్షణా సంస్థ అయిన శ్రీ గీతా నృత్య కళాశాలను విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందారు.
1957వ సంవత్సరం కొత్తఢిల్లీలో ప్రజా నాట్యమండలి ఐ.పి.టి.ఏ. వారి అధ్వర్యంలో అఖిల భారత నృత్య పోటీలు జరిగాయి . ప్రజా నాట్యమండలి ఉద్యమకర్త ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడైన గరికపాటి రాజారావు , సంపత్ కుమార్‌ను ఆ పోటీల్లో పాల్గొనమని ప్రేరేపించాడు. అయితే కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కలిగించారు . సాధారణంగా ఒక నృత్యం ప్రదర్శించాలంటే చాలా మంది సహకారం అవసరమవుతుంది. అటువంటిది కేవలం ఇద్దరితో ఏ అంశం చేయాలో అనే ఆలోచనలో పడ్డ సంపత్ కుమార్‌కి సరోజిని నాయుడు వ్రాసిన " కోరమండల్ ఫిషర్స్" అనే ఆంగ్ల కవిత మదిలో మెదిలింది. ఆ ఆలోచన అతన్ని భీమిలికి తీసుకుపోయింది. అక్కడ సముద్ర తీరాన సాగరమే సంసారంగా, దినదిన గండంగా దినాలు గడిపే నిరుపేద జాలరుల జీవన సమరాన్ని, భావగర్భితంగా ఏ సాహిత్యము లేకుండా కేవలం " మైమ్ " తో ప్రదర్శించే మహత్తర భావం రూపుదాల్చుకుంది. అవసరార్థం, పోటీకొరకు, సరదాగా కూర్చిన ఈ నృత్యం ఇతివృత్తపరంగాను , సాంకేతికపరంగాను అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. కేవలం తబలా శబ్ద తరంగాలతో, అలలు, తూఫాను హోరు, ఉరుములు, మెరుపుల సృష్టితో, ప్రేక్షకుల్ని మైమరిపింపజేసే ఈప్రత్యేక తరహా నృత్య రూపకం అవతరించి, ఒక అద్భుతమైన కళాఖండమై విరాజిల్లింది.

ఆదివారం, నవంబర్ 15, 2015

పాహిపాహి సర్పరూప

ఆదివారం, నవంబర్ 15, 2015



"కర్కోటకస్య నాగస్య దమయంతీ నలస్యచ 
ఋతుపర్ణంచ రాజర్షి కీర్తనం కలినాశనం"





పాముని చుడగా బెదిరి చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం 
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయుగా అవిదేముడే ! కోల్వుడీ ప్రజల్

మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా.  దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి.  ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.  నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.  ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.  నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
లా "నాగుల చవితి రోజున ప్రత్యక్షముగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే ..మానవునిలో ఉన్న "విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,మన అందరి హృదయాలలో నివశించే "శ్రీ మహా విష్ణువు నకు" తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాంపుగా" మారాలనికోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయిటలలోగలాంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్యపరంగా చుస్తే...కుజ,రాహు దోషాలున్న వారు, సాంసారిక బాధలు ఉన్నవారు, ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ ,చతుర్దశలలో రోజంతా ఉపవాశము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరించాలి.

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా!

నాగులు  చవితి  రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి. 
పాము పుట్ట లో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు 
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.  నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.  ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు. 
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

ఆ ప్రకృతిని మానవుడు చెజేతులార నాశనం చేసుకుంటే, ఇటు మానవ కోటికి, అటు జీవ కోటికి తప్పక వినాశనానికి దారితీస్తున్నందున భావముతో నేడు ప్రకృతిని - పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్ర
అలాగ ప్రకృతిని మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపముగా భావించి ఆనాటి నుండి నేటి వరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలాగ సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపముగా చూసుకుంటు పూజిస్తు వస్తున్నారు.

అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత!

అలా మనకంటికి కనబడే విషనాగుపాము కంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. 
ఈ మానవ శరీరము అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెమూకను "వెన్నుపాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తూన్నట్లు ,కామ, క్రోధ, లోభ,మోహ,మద,మత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో "సత్వ గుణ" సంపట్టిని హరించివేస్తూ ఉంటుంది.

యుగాల నాటిది. సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల సరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎనో గాధలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి.

ఈ "నాగుల చవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం .

నాగేంద్రా ! మేము మా వంశములో వారము నిన్ను ఆరధిస్తున్నాము. పొరపాటున "తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడు అనుకో! పడగ త్రొక్కితే కస్సుబూసుమని మమ్మల్ను భయ పెట్టకు తండ్రి ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు అంటారు.

ఈ నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది అని శస్త్రాలు పేర్కుంటున్నాయి. 

"కర్కోటకస్య నాగస్య
దమయంత్యా నలస్య చ 
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తినం కలినాశనం

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు, మొదలైనవి ప్రీతికరమైనవి అని చెప్తారు.

సర్పారధనచేసే వారి వంశం "తామరతంపరగా" వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్ణ్యేశ్వరుడే! 


నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నయని,గరళన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలాగ ప్రకృతిలో నాగు పాములకు ,మానవ మనుగడులకు అవినవ భావ సంబంధం కలదని విదితమవుతోంది.

ఈరోజు నాగుల చవితి సందర్భముగా అందరికి నాగులు చవితి శుభాకాంక్షలు. 

బుధవారం, నవంబర్ 11, 2015

దీపావళి శుభాకాంక్షలు

బుధవారం, నవంబర్ 11, 2015


దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.
దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదసినాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములోనువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.

ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః

దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,

సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే .  
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం.   ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.    

దీపావళి శుభాకాంక్షలు

గురువారం, అక్టోబర్ 29, 2015

గౌరీవ్రతము / అట్లతద్ది

గురువారం, అక్టోబర్ 29, 2015

                       











ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు.

అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు. ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి.
వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి,  అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే. వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు. 
''ఇస్తినమ్మ వాయనం''
''పుచ్చుకుంటినమ్మ వాయనం'' 
''అందించానమ్మా వాయనం''
''అందుకున్నానమ్మా వాయనం''
''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''
''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''  
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి.  మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం.
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది.
ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది.
తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే  అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి.
నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం.
గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత.

బుధవారం, అక్టోబర్ 14, 2015

బ్రహ్మచారిణి

బుధవారం, అక్టోబర్ 14, 2015

దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.
హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.
ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.
బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.
దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమెకృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

మంగళవారం, అక్టోబర్ 13, 2015

శైలపుత్రి

మంగళవారం, అక్టోబర్ 13, 2015

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥
దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.
పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.
సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.
తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.
సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.
‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)