Blogger Widgets

సోమవారం, నవంబర్ 26, 2012

కార్తీక పురాణం 13వ రోజు

సోమవారం, నవంబర్ 26, 2012

 

కన్యాదన ఫలము
ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసంలో తప్పనిసరిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటి గురించి వివరిస్తాను సావధానంగా విను.
కార్తీక మాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారినికి ఉపనయనం చేయడం ముఖ్యం. ఒకవేళ ఉపనయనం చేయడానికి ఖర్చు భరించలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణతాంబూలం, సంభావనలతో తృప్తి పరచినా ఫలితం కలుగుతుంది. ఇలా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేస్తే మనం చేసిన ఎలాంటి పాపాలైనా తొలిగిపోతాయి. ఎన్ని దానధర్మాలు చేసినా కలగని పుణ్యం ఒక పేద బ్రాహ్మణుని బాలునికి చేసిన ఉపనయంతో కలుగుతుంది. మరో పుణ్యకార్యం కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే వారు తరించడమే కాకుండా, వారి పితృదేవతలను కూడా తరింపచేసినవాడవుతాడు. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను వినమనెను.
సువీర చరిత్ర
ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడి, భార్యతో కలసి అరణ్యంలోకి పారిపోయాడు. నర్మదా నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకుని అడవిలో దొరికే కందమూలాలు, పండ్లు తింటూ కాలం గడుపుచున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య రూపవతి ఒక బాలికను ప్రసవించింది. ఆ బాలికను అతి గారాబంతో పెంచుతున్నారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక సరైన ఆహార సదుపాయాలు లేకపోయినా చూసేవారికి కనులపండుగగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ, ఆ బాలిక పెరిగి పెండ్లి వయసుకు వచ్చింది.  ఒక రోజు వానప్రస్థుని కుమారుడు ఆమెను చూసి ఆమె అందానికి పరవశుడై ఆమెను తనకిచ్చి పెండ్లి చేయమని సువీరుడు కోరాడు. అందుకు ఆ రాజు 'ఓ మునిపుత్రా ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను. నా కష్టాలు తొలగడానికి నాకు కొంత ధనమిస్తే నా కుమార్తె నిచ్చి పెండ్లి చేస్తాను' అన్నాడు. తన చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆ బాలికమీద మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరాన కుబేరుని గూర్చి ఘోరతపస్సు చేసి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించి, రాజుకు ఆ ధన పాత్రని ఇచ్చి ఆ బాలికను పెండ్లి చేసుకుని తీసుకువెళ్ళి తన తల్లితండ్రులకు నమస్కరించి అంతవరకూ జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖముగా ఉన్నాడు.  ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రతో సువీరుడు స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు. మరి కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది. ఆ బిడ్డకు కూడా యుక్తవయసు రాగానే మరలా ఎవరైనా ధనం ఇచ్చేవారికి అమ్మవచ్చనన్న ఆశతో ఎదురుచూడసాగాడు. ఒకానొక రోజున ఒక సాధుపుంగవుడు నర్మదా నదీ తీరానికి స్నానం చేయడానికి వస్తూ దారిలో ఉన్న సువీరుడుని కలుసుకుని 'నువ్వెవ్వరిని. నిన్నుచూస్తుంటే రాజవంశస్తుడవలే ఉన్నావు? నువ్వు ఈ అరణ్యంలో ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.' సువీరుడు 'మహానుభావా నేను వంగదేశానికి రాజుని. నా రాజ్యాన్ని శత్రవులాక్రమించారు. భార్యతో కలసి ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమైనది ఏదీ లేదు. నాకు ఇద్దరు కుమార్తెలు. నా మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి అతని వద్ద కొంత ధనమును తీసుకొన్నాను. దానితోనే ఇంతవరకూ నెట్టుకొస్తున్నాను అని చెప్పాను.'అప్పుడు ఆ ముని 'ఓ రాజా నువ్వు ఎంత దరిద్రుడివైనా, ధర్మసూక్షమాలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్యావిక్రయం మహా పాపాలలో ఒకటి. కన్యను విక్రయించివారు 'అసిపత్రవన'మను నరకం అనుభవిస్తారు. ఆ ధనముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్ధం ఏ వ్రతం చేస్తారో వారు నాశనం అయిపోతారు. అంతేకాకుండా కన్యా విక్రయం చేసేవారికి పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలానే కన్యను ధనమిచ్చి పెండ్లాడినవారు చేసే గృహస్థ ధర్మాలు వ్యర్థమవుటయే గాక అతడు మహా నరకం అనుభవిస్తాడు. కన్యా విక్రయం చేసేవారికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కాణించి చెబుతున్నారు. కాబట్టి రాబోయే కార్తీకమాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలదీ బంగారు నగలతో అలంకరించి సదాచార సంపన్నుడు, ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చెయ్యి. అలా చేస్తే గంగాస్నానం చేసినంత ఫలం, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం పొందుటయే కాకుండా, మొదట కన్యను అమ్మిన పాపం కూడా తొలిగిపోతుంది' అని రాజుకు హితవు చెప్పాడు.అందుకారాజు చిరునవ్వు నవ్వి 'ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాల వలన వచ్చిన ఫలం ఎక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను, సిరిసంపదలతోనూ సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతమున్న అవకాశం చేతులారా జారవిడవమంటారా? ధనమూ, బంగారం ఉన్నవారే ప్రస్తుతలోకంలో రాణింపగలరు. ముక్కూ, నోరు ముసుకుని బక్కచిక్కి శల్యమై ఉన్నవారిని ఈ లోకం గుర్తిస్తుందా?, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నేనడిగినంత ధనం ఎవరైతే నాకిస్తారో, వారికే నా రెండవ కుమార్తెను కూడా ఇచ్చి పెండ్లి చేస్తాను' అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. యమలోకములో అసిపత్రమనే నరకభాగంలో పడవేసి అనేక విధాలుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన సృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గంలో సర్వసుఖములు అనుభవిస్తున్నాడు. సువీరుడు చేసిన కన్యావిక్రయం వలన ఆ సృతకీర్తిని కూడా యమకింకరులు పాశాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకొచ్చారు. అప్పుడు సృతకీర్తి 'నాకు తెలిసినంతవరకు దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేసి, ఇతరులకు ఉపకారమే చేశాను. మరి నాకు ఇటువంటి దుర్గతి ఎలా కలిగింది?' అనుకుని నిండు సభలో కొలువుదీరియున్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి 'ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటినంతటినీ సమంగా చూస్తావు. నేనెప్పుడూ ఏ పాపం చేయలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకలోకానికి తీసుకొచ్చిన కారణం ఏమిటి? దయచేసి తెలియజేయండి' అని ప్రాధేయపడ్డాడు. యమధర్మరాజు సృతకీర్తిని చూస్తూ 'సృతకీర్తి నువ్వు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు. నువ్వు ఎటువంటి దురాచారాలు చేయలేదు. కానీ నీ వంశస్తుడు అయిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనానికి ఆశపడి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకొన్నవారి ఇటు మూడు తరాలు, అటు మూడు తరాలువారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకాన్ని అనుభవించడమే కాకుండా నీచజన్మలెత్తవలసి వస్తుంది. నీవు పుణ్యాత్ముడవని, ధర్మాత్ముడవని తెలుసు. కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను. నీ వంశస్తుడు సువీరునికి మరొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నతీ తీరాన తల్లి వద్ద పెరుగుతోంది. నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి, అక్కడకు వెళ్ళి ఆ కన్యను వేదపండితుడు, శీలవంతుడు అయిన ఒక బ్రాహ్మణునికి కార్తీకమాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ధనంతో కన్యాదానం చేసినా, విధి విధానంగా ఆబోతునకు అచ్చువేసి వివాహం చేసినా కన్యాదాన ఫలం లభిస్తుంది. కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినవన్నీ చేసిరా. అలా చేయడం వల్ల నీ పితృగణం తరిస్తారు వెళ్ళిరమ్మని' యమధర్మరాజు పలికెను. సృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరాన ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను, కుమార్తెను చూసి సంతోషించి ఆమెతో విషయమంతా చెప్పి, కార్తీకమాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ కుమారునికిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. అలా కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు.  కన్యాదనం వల్ల మహాపాపాలు కూడా నాశనమవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని దీక్షబూని ఆచరించివాడు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళతాడు.

ఆదివారం, నవంబర్ 25, 2012

నాతో మాట్లాడాలి అంటే

ఆదివారం, నవంబర్ 25, 2012


ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే


Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు.

కార్తీక పురాణం 12వ రోజు

ద్వాదశీ ప్రశంస: మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది.
కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుమనికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచినవారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలూ తొలిగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది.

సాలగ్రామ దాన మహిమ
పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివశించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడూ, ఎవరకీ దానం చెయ్యడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ, ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు ఆ వైశ్యుడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ ఋణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు ఆ వైశ్యుడు పండిపడి 'అలా వీలు కాదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను' అంటూ ఆవేశంతో ముందూ, వెనుకా ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక, అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడకొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకమును దర్శించి, భూ లోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండప్రాణాలాచరించి, విష్ణుదేవునిగా భావించి, ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి 'మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి, తమరు వచ్చిన కార్యాన్ని వివరించ'మని వినయంగా వేడుకున్నాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి 'ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులయినా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాకా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకోమని' చెప్పాడు నారదమహర్షి. అప్పుడు ధర్మవీరుడు 'నారద మహర్షీ! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ 'సాలగ్రామ'మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది. దీని వలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి' అని అడిగాడు.
ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి 'ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు. శ్రీహరియొక్క ప్రతిరూపం. అన్ని దానలకంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరకబాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు' అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.
ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ, దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా, మూడు జన్మలందు వానరమై, అయిదు జన్మలందు ఎద్దుగా, మరో పది జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లిచేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.
చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లితండ్రులు, బంధువులు చాలా దు:ఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి 'నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక' అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి, మరణానంతరం స్వరాగానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినా దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను.

శనివారం, నవంబర్ 24, 2012

క్షీరాబ్ది ద్వాదశి

శనివారం, నవంబర్ 24, 2012

కార్త్తికంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని , చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు . ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్సనం ఇచ్చే  శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీ తో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట కావునా ఈ ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే  తులసి దగ్గర కు వస్తారు  . ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు.  మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా విలిగించక పూయిన ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వేలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.
దూర్వాస మహర్షి వారి చేత శపించ బడి  వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచన తో  రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని  మధించినరోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు  చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనేఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
మన పురాణ ఇతిహాసాలలో తులసికున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యం వెలకట్టలేనిది. ‘తులసి’ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా, లక్ష్మీసమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే తులసిని పూజించినవారి ఇంట ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు.  తులసి పూజవల్ల అపారమైన పుణ్యఫలాలు సంప్రాప్తిసాయి సత్యాదేవి తులాభారమున . రుక్మిణీదేవి తులసీదళమునుంచి తూచి తకృష్ణుణ్ణి తన వాడుగా చేసుకొంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాధుని కర్పించి అతనికిష్టురాలై శ్రీరంగనాధుని సాన్నిధ్యం పొందింది. వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస, మన పురాణాలలో అనేకచోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మవృత్తాంతం తెలిపే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
పురాణగాథ:
తులసి మధురానగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందింది. తులసి, శ్రీకృష్ణుల అనురాగాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవీ, ధర్మధ్వజులను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజ దంపతులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా, ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనకల అందానే్నతలదన్నిన అందకత్తెగా ఆమె పేరుగాంచింది. అలాగే ఆమె గుణ రూపాదులలో తుల  లేక పోవడంవల్ల ఆమెకు ‘తులసి’ అని పేరొచ్చింది. బ్రహ్మకోసం తపస్సు చేసి, విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది. ఇది ఇలా వుండగా శ్రీకృష్ణుని అంశగల సుధాముడు శంఖచూడుడను రాక్షసుడిగా జన్మించాడు. బ్రహ్మనుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంతవరకూ శంక చూడుడికి మరణం సంభవించదని వరమిచ్చాడు. ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై, ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివాహం చేసుకున్న శంఖచూడుడు ఆమె ప్రాతివ్రత్య ప్రభావంతో, దేవతలను, మునులను మట్టుబెట్టినా, ఎవరూ ఏమీచేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి దేవతలు, మునుల అభీష్టంమేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనంతరం అతను తన భర్తకాదని తెలుసుకుని రాయిని కమ్మనమని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాప పడింది. శ్రీహరి ఆమెని అనుగ్రహించాడు. ఆమె అప్పటినుంచి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీరం గండకీ నదియై ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామ రూపాన ఉన్న తాను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఆనాటినుంచి తులసి లక్ష్మీస్వరూపంగా పూజింపబడుతోంది.
తులసి పూజ ఇలా చేయాలి:
తులసి కోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి వాటిమీద దీపాలుంచి తులసి దేవిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల భక్ష్యాలను, ఫలాలను నివేదించి అయిదు తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శద్ధ ఏకాదశి వరకూ పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి, తులసీదేవిని, లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశినాడు మానెడు బియ్యపు పిండితో మూడు ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసివద్ద ఒక దానినుంచాలి. రెండవ దానిని బ్రాహ్మణునికీయాలి. మూడవ దానిని రోటిలోనుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలాచేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది.

కార్తిక పురాణం 11వ రోజు

మంధరుడు - పురాణ మహిమఓ జనక మాహారాజా! ఈ కార్తీక మాస వ్రత మహాత్మ్యం గురించి ఎన్ని ఉదాహరణలు చెప్పినా తనివితీరదు. ఈ మాసములో విష్ణువును అవిసెపూలతో పూజిస్తే చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు పూజ తర్వాత పురాణపఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీనికొక ఇతిహాసము చెప్తాను. శ్రద్ధగా ఆలకించమమని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగిరి.
పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భోజనము చేస్తూ, మద్యపానీయాలకు అలవాటు పడ్డాడు. అంతే కాక తక్కువ జాతి వారితో స్నేహము వలన స్నాన, జప, దీపారాధన వంటి ఆచారాలను కూడా పాటించక దురాశాపరుడై ఉండెను. అతని భార్య మహా గుణవంతురాలు. శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవముగా భావించి విసుక్కోక సకల ఉపచారాలను చేస్తూ, పతివ్రతా ధర్మమును పాటించసాగెను.
మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవానిగా పనిచేయుచున్ననూ, ఇల్లు గడవక చిన్న వ్యాపారాన్ని కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్టగడవక పోవడం వల్ల దొంగతనములు చేస్తూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న డబ్బును, వస్తువులను అపహరించి జీవించసాగెను. ఒక రోజు ఓ బ్రాహ్మణుడు అడవిదారిన పోతున్నప్పుడు అతన్ని భయపెట్టి, కొట్టి అతని దగ్గరున్న డబ్బును లాక్కుంటున్నప్పుడు అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి డబ్బును చూడగానే వారిద్దరినీ చంపి ఆ డబ్బును మూటగట్టుకునెను. అంతలో దగ్గరలో ఉన్న గుహనుండి పులి వొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకున్ని చంపుటకు ప్రయత్నించగా కిరాతకుడు దానిని చంపెను. కానీ ఆ పులి కూడా అతనిపై పంజా విసరడం వల్ల ఆ దెబ్బలకు చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలమున నలుగురూ నాలుగు విధాలుగా మరణించినారు. ఆ నలుగురూ యమలోకములో అనేక శిక్షలు అనుభవిస్తూ, రక్తము గ్రక్కుచూ బాధపడుచుండిరి.
మంధరుడు చనిపోయిన దగ్గర నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేస్తూ భర్తను తలచుకొని దు:ఖించుచూ కాలము గడుపుచుండెను. కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి 'స్వామీ! నేను దీనురాలను. నాకు భర్తగానీ, సంతతి గానీ లేరు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్న దాన్ని. కాబట్టి నాకు మోక్షమార్గాన్ని ఉపదేశించమని ప్రార్థించెను.'
ఆమె వినయానికి, ఆచారానికి ఆ ఋషి సంతోషించి 'అమ్మా ఈ రోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు వృధాగా పాడుచేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను నూనె తీసుకువస్తాను. నీవు ప్రమిదను, వత్తిని తీసుకుని రమ్మని చెప్పెను. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు పొందవచ్చని చెప్పగానే ఆమె సంతోషముతో వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రము చేసి, గోమమయముచే అలికి ముగ్గులు పెట్టి, తానే స్వయంగా రెండు వత్తులను చేసి, ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారికల్లా ఆ రోజు రాత్రి ఆలయం దగ్గర జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను.
ఆమె కూడా ఆ రాత్రంతయూ పురాణము వినెను. ఆ రోజు నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలానికి మరణించెను. ఆమె పుణ్యాత్మురాలు అగుటవల్ల విష్ణు దూతలు వచ్చి ఆమెను విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో కలిసి ఉండడం వల్ల కొంత దోషం వల్ల మార్గ మధ్యమమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అక్కడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి 'ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి నా యందు దయతలచి వారిని కాపడమని' వేడుకొనెను.
అంత విష్ణుదూతలు 'అమ్మా నీ భర్త బ్రాహ్మణుడైనప్పటికీ స్నాన, సంధ్యావందనాలు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే స్నేహితుడ్ని చంపి డబ్బు కాజేసెను. ఇక మూడవవాడు పులి. నాల్గవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై పుట్టినా అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశి రోజున కూడా తైల లేపనము, మద్యమాంస భక్షణ చేసినాడు కావున పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురూ నరక బాధలు అనుభవిస్తున్నారని వారి చరిత్రలు చెప్పెను.'
అందుకామె చాలా విచారించి 'ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురుని కూడా రక్షించమని ప్రార్థించగా, అందుకు విష్ణు దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును పులికి, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము విప్రునకు, ధారపోసినచో నీ భర్తతో పాటు వారికీ మోక్షము కలుగుతుందని చెప్పగా ఆమె అలానే ధారపోసెను. ఆ నలుగురూ ఆమె దగ్గరకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి'. కాబట్టి 'ఓ రాజా! కార్తీక మాసములో పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలమును పొందవచ్చునో తెలుసుకున్నావు' కదా అంటూ వశిష్ఠులవారు ఇలా చెప్పసాగిరి.

శుక్రవారం, నవంబర్ 23, 2012

యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదినము.

శుక్రవారం, నవంబర్ 23, 2012

కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవతారు అన్న విషయం అందరికి తెలుసు ఆవిషయాన్ని రుజువు చేసారు. కృషి ,పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు మారు పేరుగా వున్న మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి. ఈరోజు కార్తికశుద్ధ దశమి అంటే యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదినము.  నాకు ఋషులలో  చాలా ఇష్టమైన మహర్షి యాజ్ఞవల్క్యుడు.  ఎందుకు ఇష్టం అన్నది చెప్తా. ఆయన కధ  మీకు తెలుసుకోవాలని కుతూహలముగా వుంటుంది అని నాకు తెలుసు అందుకే మీకోసం యాజ్ఞవల్క్య మహర్షి కధ.
పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది. ఆ నగరంలోనే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్యపేరు సునంద. ఆ దంపతులిద్దరికీ జన్మించినవాడే యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడికి ఆయన తండ్రి సమయ సందర్భ కాలోచితంగా చెయ్యాల్సిన సంస్కారాలన్నీ చేయించాడు. దాంతో యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణవేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడి తండ్రి యజ్ఞవల్క్యుడు తన కుమారుడిని వైశంపాయన మహర్షి దగ్గరకు పంపాడు.  ఈ వైసంపాయన మహర్షి యాజ్ఞవల్క్య కి మేనమామ.  అతని దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆ వేదంతోపాటు మరింకా ఎన్నెన్నో విషయాలను గ్రహించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు. ఆ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయని అనుకున్నాడు ఆ గురువు. అయితే యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం పెరగసాగింది. అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదనపడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు. తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పినవాటినన్నింటినీ కక్కి వెళ్ళిపొమ్మని అన్నాడు. గురుద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసుకొన్నాడు. క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళిపోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు  కక్కిన దానిని  వైశంపాయుని శిష్యులు తిత్తిరిపక్షులుగా మారి  గ్రహించారు. అవి పలికె పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.  
గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్క్యుడు దిగాలుపడి కూర్చోలేదు. ఆత్మస్త్థెర్యంతో సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. అలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరుతెచ్చుకున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమశిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు. ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యుడికి ఆహ్వానం వెళ్ళింది. అలా మహర్షులందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యావంతులైతే వారొచ్చి ఇక్కడున్న ధనరాశులను తీసుకువెళ్ళవచ్చు అని గంభీరంగా అన్నాడు. అయితే రుషులంతా ఒకరిముఖాలు ఒకరు చూసుకొని తామందుకు అర్హులం కామనుకొంటూ ఊరకనే కూర్చున్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులను తన ఇంటికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. యాజ్ఞవల్క్యుడి ధైర్యాన్ని చూసిన అక్కడివారంతా అతడితో శాస్త్రవిషయాల్లో పోటీకి దిగి యాజ్ఞవల్క్యుడిని అనర్హుడిగా నిరూపించేందుకు ఎన్నోవిధాలుగా ప్రయత్నం చేశారుకానీ అవేవీ వారివల్లకాలేదు. దాంతో జనకుడు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించాడు. జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఓరోజున విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుడి దగ్గరకు వచ్చాడు. తత్త్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకొని యాజ్ఞవల్క్యుడంతటి గొప్పవాడు మరొకడు లేడని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. అనంతరకాలంలో ఆ ఋషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడికిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని వివాహమాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయంచేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలా చేసింది. కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలయ్యారు. ఆనాటి రుషులంతా యాజ్ఞవల్క్యుడిలోని విద్యావైభవాన్ని, యోగప్రాభవాన్ని గుర్తించి యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. ఆయన ప్రకటించిన యోగవిషయాలు యోగయాజ్ఞవల్క్యంగా ప్రసిద్ధికెక్కాయి. చివరలో భార్యలకు కూడా తత్త్వాన్ని ఉపదేశించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు.   ఇంతగొప్ప మహర్షి అయిన యాజ్ఞవల్క్య గురుదేవుల వారి పాదపద్మాలకు నమస్సులు తెలుపుకుంటున్నాను.

కార్తీక పురాణం 10వ రోజు

ద్వాదశీ ప్రశంస  
మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది.
కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుమనికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచినవారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలూ తొలిగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది.

సాలగ్రామ దాన మహిమ

పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివశించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడూ, ఎవరకీ దానం చెయ్యడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ, ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు ఆ వైశ్యుడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ ఋణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు ఆ వైశ్యుడు పండిపడి 'అలా వీలు కాదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను' అంటూ ఆవేశంతో ముందూ, వెనుకా ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక, అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడకొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకమును దర్శించి, భూ లోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండప్రాణాలాచరించి, విష్ణుదేవునిగా భావించి, ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి 'మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి, తమరు వచ్చిన కార్యాన్ని వివరించ'మని వినయంగా వేడుకున్నాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి 'ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులయినా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాకా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకోమని' చెప్పాడు నారదమహర్షి. అప్పుడు ధర్మవీరుడు 'నారద మహర్షీ! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ 'సాలగ్రామ'మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది. దీని వలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి' అని అడిగాడు.
ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి 'ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు. శ్రీహరియొక్క ప్రతిరూపం. అన్ని దానలకంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరకబాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు' అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.
ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ, దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా, మూడు జన్మలందు వానరమై, అయిదు జన్మలందు ఎద్దుగా, మరో పది జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లిచేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.
చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లితండ్రులు, బంధువులు చాలా దు:ఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి 'నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక' అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి, మరణానంతరం స్వరాగానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినా దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను.

గురువారం, నవంబర్ 22, 2012

భావయామి గోపాలబాలం

గురువారం, నవంబర్ 22, 2012


భావయామి గోపాలబాలం మన 
సేవితం తత్పదం చింతయేయం సదా 

కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా 
పటల నినదేన విభ్రాజమానం 
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం 
చటుల నటనా సముజ్జ్వల విలాసం 


నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది 
సుర నికర భావనా శోభిత పదం 
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం 
పరమపురుషం గోపాలబాలం … భావయామి


ఆ బాల కృష్ణుడు నడుముకు కట్టుకున్న మేఖలము, అలంకరించ బడిన మణి ఘంటిక, మృదువైన శబ్దాలు చేస్తూ విలసిస్తున్నాయిట. కొంటె పదములు వేస్తూ, పెన వేసుకుంటూ, దూరమవుతూ, అద్భుతమైన నటన చేస్తూ ఉన్నాడుట. ఎల్లప్పుడూ చేతులకు వెన్న కలిగి ఉండే దొంగ కృష్ణుడు, బ్రహ్మ మొదలగు దేవతల భావనలలో ఆయన పాదాలు శోభిల్లుతాయిట. ఆయనే శ్రీ హరి, పరమపురుషుడు, వేరే ఉపమానము లేని వాడు, శ్రీ వేంకటాచలముపై వెలసిన శ్రీనివాసుడు.

ఈ పొడుపు కధ మీకు తెలుసా


నేను ఒక పొడుపు కధని అడుగుతాను జవాబు మీకు తెలుసా అయితే జవాబు చెప్పండి  మరి. 
ఋతువులో వుంది.
లతలో వుంది .
కన్నెపిల్ల సిగ్గులో వుంది. 
దేవుని దయలో వుంది.
స్నేహపరిమళంలో వుంది. 
ఏమిటది?

కార్తీక పురాణం 9వ రోజు

అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతము:
జనకుడు వశిష్ఠులవారితో మునిశ్రేష్ఠా! ఈ అజామిళుడు ఎవడు? పూర్వజన్మలో ఎట్టిపాపములు చేసియుండెను? ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తర్వాత ఏమి జరిగెనో వివరించమని ప్రార్థించెను. అంత ఆ మునిశ్రేష్ఠుడు జనకమహారాజుతో ఇట్లు పలికెను.
జనకా! అజామిళునిని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకువెళ్ళిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు వద్దకు వెళ్ళి ప్రభూ! తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుడుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అక్కడకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిళుడిని విమానమెక్కించుకొని వైకుంఠమునకు తీసుకొనిపోయిరి. మేము చేయునది లేక చాలా విచారిస్తూ వచ్చాము అని భయపడుతూ చెప్పిరి.
'ఔరా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇలా జరగలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి యుండవచ్చును' అని యమధర్మరాజు తన దివ్యదృష్టితో అజామిళుని పూర్వ జన్మ వృత్తాంతమును తెలుసుకొని 'ఓహో! అదియా సంగతి! తన అవసాన కాలమున 'నారాయణా' అని వైకుంఠవాసుని నామస్మరణ చేసినందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలిసిగానీ, తెలియకగాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా!' అని అనుకొనెను.
అజామిళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగానుండెను. అతడు అపురూపమైన అందం చేతను, సిరిసంపదల చేతను, బలము చేతను గర్విష్టియై, వ్యభిచారియై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమును అపహరించుచూ, శివాలయమలో ధూపదీప నైవేద్యాలను పెట్టక, దుష్టసహవాసములను చేస్తూ తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో సంబంధము పెట్టుకొనెను. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియూ, చూడనటుల ప్రవర్తించుచూ భిక్షాటనకై ఊరూరా తిరుగుతూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు.
ఒకనాడు పొరుగూరికి వెళ్ళి యాచన చేసి పెద్దమూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి ఈ రోజు నేను ఎంతో అలసిపోయాను, నాకు ఈ రోజు ఆకలి ఎక్కువగా ఉన్నది. త్వరగా వంటచేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకామె చీదరించుకొనుచూ నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్ళు కూడా ఇవ్వక, అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు కలదై భర్తను తూలనాడడం వల్ల భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంత ఆమె భర్త నుండి చేతికర్రను లాక్కొని భర్తను రెండింతలుగా కొట్టి బైటకు తోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలచి దేశాటనకు వెళ్ళిపోయెను.
భర్త ఇంటినుండి వెళ్ళిపోయెను కదా అని సంతోషించిన ఆమె ఆ రాత్రి బాగా అలంకరించుకొని వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి 'ఓయీ నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు' రమ్మని కోరెను. అంత ఆ చాకలి 'తల్లీ! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నీచకులస్తుడను. చాకలి వాడునూ. మీరీ విధముగా పిలుచుట యుక్తము కాదు. నేనిట్టి పాపపుపని చేయజాలను' అని బుద్ధి చెప్పి వెడలిపోయెను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కలసి తన కామవాంచ తీర్చమని పరిపరివిధముల బ్రతిమాలి ఆ రాత్రంతయూ అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి 'అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని? అగ్ని సాక్షికా పెండ్లాడిన భర్తను ఇంటినుండి వెడలగొట్టి, క్షణికమైన కామవాంఛలకు లోనై మహాపరాధము చేసితిని' అని పశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను.
కొన్ని రోజులు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా అతనిపాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికవల్ల భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంత కాలమునకు ఏదియో వ్యాది సంక్రమించి దినదినమూ క్షీణించుట చేత మరణించెను. అతడు రౌరవాది నరక కూపమన పడి నానాబాధలు అనుభవించి మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై, కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసినందువలన ఏడు జన్మముల పాపములు నశించుటచేత అజామిళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసాన కాలమున 'నారాయణా' అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠముకు పోయెను.
బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. ఆమె యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాసి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. దాంతో మాలవాడా శిశువుని తీసుకొని పోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవుచూ పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను. అదీ వారి పూర్వజన్మ వృతాంతము అని తెలిపెను.
నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటివారైననూ మోక్షమును పొందగలరు. కాన కార్తీక మాసమందు వ్రతములు, పురాణశ్రవణములు చేసివారు ఇహ, పర సుఖములను పొందగలరు.

బుధవారం, నవంబర్ 21, 2012

కార్తీక పురాణము 8వ రోజు

బుధవారం, నవంబర్ 21, 2012


విష్ణుదూతల, యమభటుల వివాదము
ఓ యమదూతలారా! మేము విష్ణుదూతలం. వైకుంఠమునుండి వచ్చాము. మీ ప్రభువు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మన్నారో తెలిపమని ప్రశ్నించిరి.
దానికి బదులుగా యమదూతలు 'విష్ణుదూతలారా! మానవులు చేయు పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రీ పగలూ, సంధ్యాకాలము సాక్షులుగా ప్రతిదినం మా ప్రభువు వద్దకు వచ్చి తెలుపుతారు. మా ప్రభువు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునిచే తెలుసుకుని ఆ మానవుని చివరిదశలో మమ్ము పంపించి వారిని రప్పించెదరు. పాలులెటువంటివారో వినండి... వేదోక్త సదాచారములను వీడి, వేదశాస్త్రములను నిందించువారును, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపాలను చేసినవారునూ, పరస్త్రీలను కామించినవారు, పరాన్నభుక్కులు, తల్లితండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని చీదరించుకునేవారు, జీవహింస చేయువారు, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను బాధించువారు, శిశుహత్య చేయువారు, శరణన్నవారిని సైతం బాధించేవారు, చేసిన మేలును మరచిపోయేవాడు, పెండిండ్లు, శుభకార్యాలు జరగనివ్వక అడ్డుతగిలే వారూ పాపాత్ములు. వారు మరణించగానే తన వద్దకు తీసుకువచ్చి దండించమని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. ' కాబట్టి అజామిళుడు బ్రాహ్మణుడై పుట్టి చెడు సావాసాలకు లోనై, కులభ్రష్టుడై జీవహింసలు చేస్తూ, కామాంధుడై వావి వరసలు లేని పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎలా తీసుకుపోదురు? అంటూ యమభటులు ప్రశ్నించిరి.
 
అంతట విష్ణుదూతలు 'ఓ యమకింకరులారా! మీరు ఎంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మాలు ఎటువంటివో చెప్తాను వినండి. మంచివారితో స్నేహము చేయువారు, తులసి మొక్కలను పెంచువారు, బావులు, చెరువులు త్రవ్వించువారు, శివ కేశవులను పూజించేవారు, సదా హరినామాన్ని కీర్తించువారు, మరణ కాలమందు 'నారాయణా' అని శ్రీహరిని గాని, 'శివ శివా' అని పరమేశ్వరుణ్ని గానీ తలచినచో తెలిసిగాని, తెలియకగాని మరే రూపమునగాని శ్రీహరి నామ స్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు! కాబట్టి అజామిళుడు ఎంత పాపాత్ముడైనా మరణకాలమున 'నారాయణా' అని పలుకుచూ చనిపోయెను. కాబట్టి మేము వైకుంఠానికే తీసుకుని వెళ్తామని పలికెను.
అజామిళుడు విష్ణు, యమదూతల సంభాషణలు విని ఆశ్చర్యం పొంది 'ఓ విష్ణుదూతలారా! పుట్టిన నాటి నుండి చనిపోయేవరకూ నేను శ్రీమన్నారాయణుని పూజగాని, వ్రతములు గాని, ధర్మములు గానీ చేయలేదు. నవమాసములు మోసి కనిపెంచిన తల్లితండ్రులకు కూడా నమస్కారం చేయలేదు. వర్ణాశ్రమాలు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల స్త్రీలతో సంసారము చేసి... నా కుమారునిపై ఉన్న ప్రేమతో 'నారాయణా' అని అన్నంత మాత్రమున నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోతున్నారు. ఆహా నేనెంతటి అదృష్టవంతుడ్ని. నా పూర్వ జన్మ సృకృతము. నా తల్లి తండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అంటూ సంతోషముగా విమానెక్కి వైకుంఠమునకు' వెళ్ళెను.
కాబట్టి ఓ జనక చక్రవర్తీ! తెలిసిగానీ, తెలియకగానీ నిప్పును తాకితే బొబ్బలెక్కి ఎంత బాధ కలిగించునో, అటులనే శ్రీహరిని తెలిసీ తెలియకో స్మరించినంతనే సకల పాపాలనుండి విముక్తి పొందుటయే కాక మోక్షాన్ని కూడా పొందుతాము.

మంగళవారం, నవంబర్ 20, 2012

కార్తీక పురాణము 7వ రోజు

మంగళవారం, నవంబర్ 20, 2012


శ్రీ హరినామస్మరణ సర్వపలప్రదము:
వశిష్ఠుడు చెప్పిన విషయాలను విని 'మహానుభావా! మీరు చెప్పిన ధర్మములను శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహు చిన్నదైనా పుణ్యము అధికంగా కలుగుతుంది. అదీ నదీ స్నానము, దీపదానము, పండుదానం, అన్నదానం, వస్త్రదానము వలన కలుగుతుందని చెబుతున్నారు. ఇట్టి చిన్న చిన్న ధర్మములవలన మోక్షము లభిస్తుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తే గానీ పాపములు తొలగవని మీవంటి శ్రేష్టులే చెప్పెను కదా. మరి మీరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెబుతున్నందుకు నాకు ఎంతో ఆశ్చర్యము కలుగుతుంది. దుర్మార్గులు కొందరు ఆచారాలను పాటించక, వర్ణ సంకరులై మహా పాపములను చేసివారు ఇంత తేలికగా మోక్షాన్ని పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిదికాదా! కావున దీని మర్మమును తెలిపమని కోరెను.' వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి జనకమహారాజా! నీవు అడిగిన ప్రశ్న నిజమైనదే. నేను వేదవేదాంగములను కూడా పఠించాను. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అనే ధర్మాలు మూడు రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యమను గుణము పుట్టి ఫలమంతయును పరమేశ్వరునికి అర్పించి, మనస్సునందు ధర్మాన్ని పాటించిన ఆ ధర్మము ఎంతో మేలు చేస్తుంది. సాత్విక ధర్మము సమస్త పాపాలను తొలగించి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖాలను సమకూర్చును.  ఉదాహరణకు తామ్రపర్ణి నది యందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు నీరు పడినచో ధగాధగా మెరిసి, ముత్యమగు విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మాన్ని ఆచరించుచూ గంగా, యమునా, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగున్న పుణ్యకాలాలలో దేవాలయాలలో వేదాలు పఠించి, సదాచారపరుడైన, గృహస్థుడైన బ్రాహ్మణునకు ఎంత చిన్న దానము చేసినా, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయాలలో జపతపాదుల్ని చేసినా విశేష ఫలాన్ని పొందుతారు. రాజస ధర్మమమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త ధర్మాలను వీడి చేసిన ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగిస్తుంది. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసో, తెలియకో ఏ చిన్న ధర్మాన్ని చేసినా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్టలో చిన్న మంట ఏర్పడినా మొత్తం భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామాన్ని తెలిసిగానీ, తెలియకగానీ తలచినచో వారి సకల పాపాలు పోయి ముక్తి పొందుతారు. దానికి ఓ చిన్న కధ కలదు.
అజామీళుని కథ:
పూర్వ కాలంలో కన్యాకుబ్జమను నగరంలో నాలుగు వేదాలు చదివిన ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి ఎంతో గుణవంతురాలైన హేమవతి అనే భార్య కలదు. ఆ దంపతులు ఎంతో ఆదర్శంగా నిలిచి అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలానికి లేకలేక ఓ కుమారుడు జన్మించాడు. వారు అతడిని ఎంతో గారాభంగా పెంచుతూ అజామీళుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరుగుతూ అతి గారాభం వల్ల పెద్దల మాటను కూడా వినక, చెడు స్నేహాలు చేస్తూ, చదువును నిర్లక్ష్యము చేసి, బ్రాహ్మణ ధర్మాలను పాటించక తిరుగుచుండెను.  కొంతకాలానికి యవ్వనము రాగా కామాంధుడై, మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును వీడి, మద్యము తాగుచూ, ఒక ఎరుకల జాతి స్త్రీని మోహించి ఆమెతోనే కాపురం చేయుచుండెను. ఇంటికి కూడా పోకుండా ఆమె ఇంటనే భోజనం చేయుచుండెను. అతి గారాభం ఎలా చెడగొట్టిందో వింటివా రాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా చిన్ననాటి నుండి సక్రమంగా పెంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి అజామీళుడు కులాన్ని వీడడంతో అతని బంధువులు అతడిని విడిచి పెట్టారు.  అందుకు అజామీళుడు కోపంతో వేట వలన పక్షులను, జంతువులను చంపుచూ కిరాతక వృత్తిలో జీవిస్తున్నాడు. ఒకరోజున ఈ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచూ కాయలను కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనె పట్టును తీసుకోబోతుండగా కొమ్మ విరగడంతో ఆమె చనిపోయింది. అజామీళుడు ఆ స్త్రీపై పడి కొంత సేపు ఏడ్చి, తరువాత అక్కడే ఆమెను దహనం చేసి ఇంటికి వెళ్ళెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఓ కూతురు ఉంది. కొంత కాలానికి ఆ బాలిక పెరిగి పెద్దైనాక కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీళుడు ఆ బాలికతో కాపురం చేయుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు. ఆ ఇద్దరు పుట్టగానే చనిపోయారు. మరల ఆమె గర్భము ధరించి ఒక కొడుకును కన్నది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనా విడువక, ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకుని వెళ్తూ, నారాయణ, నారాయణ అని ప్రేమతో పెంచుకుంటున్నారు. కాని నారాయణ అని తలచినంతనే ఎటువంటి పాపాలైనా తొలగి పుణ్యాన్ని పొందవచ్చని వారికి తెలియదు. ఇలా కొంత కాలము జరిగిన తర్వాత అజామీళుడు అనారోగ్యంతో మంచం పట్టి చావుకు సిద్ధంగా ఉండెను.  ఒకనాడు భయంకర రూపాలతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైనారు. వారిని చూచి అజామిళుడు భయంతో కొడుకుపై ఉన్న ప్రేమతో నారాయణా, నారాయణా అంటూ ప్రాణాలను వదిలెను. అజామిళుని నోట నారాయణా అన్న మాట వినగానే యమ భటులు గజగజ వణకసాగిరి.  అదే సమయానికి దివ్యమంగళాకారులు, శంకచక్ర గదాధారులైన శ్రీమన్నారాయణుని భటులు కూడా విమానంలో అక్కడకు వచ్చారు. ఓ యమ భటులారా వీడు మావాడు. మేము ఇతన్ని వైకుంఠమునకు తీసుకువెళ్తాం అని చెప్తూ అజామిళుడుని విమానమెక్కించి తీసుకొని పోవడానికి సిద్ధమవ్వగా, యమదూతలు అయ్యా! మీరు ఎవరు? అతడు దుర్మార్గుడు. ఇతన్ని నరలోకానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము. కాబట్టి మాకు వదలమని కోరగా, విష్ణుదూతలు ఇలా చెప్పసాగెను.

సోమవారం, నవంబర్ 19, 2012

ఉరిమైఉరిమెను పిడుగైసాగె

సోమవారం, నవంబర్ 19, 2012

ఈరోజు వీరనారి ఝాన్సీ లక్ష్మిబాయి జయంతి.  ఆమె జయంతి పురస్కరించుకొని ఇక్కడ కధని మరియు నాకు నచ్చిన మంచి ఇన్స్పెరేషణ్ పాట మీకోసం.




ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

తెల్లవారిపై నల్లత్రాచులా బుసలుకొట్టెను ఝాన్సీరాణి
నల్లమనసుల తెల్ల మనుషుల భరతంపట్టే ఝాన్సీరాణి
మీపాలిట యమదూతగమారి పాశంవిసెరెను లక్ష్మిబాయి
సాగదురాఇక మీపెత్తనము తప్పదురా మీ తిరుగుప్రయాణము

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

ఆత్మగౌరవము వెల్లువలాగా పెల్లుబికిన ఈఝాన్సీరాణి 
దౌర్జన్యాలకు దుర్మార్గాలకు మహిషాసుర మర్ధినిలాగ  
ఆటకట్టునీ ఆటకట్టునీ నీకపటాలన్ని కట్టిపెట్టు 
ఆంగ్లేయుడా ముటలుకట్టు నయవంచకుడా పయనంకట్టు

ఉరిమైఉరిమెను పిడుగైసాగెను ఝాన్సీరాణి లక్ష్మిబాయి

దుర్గాదేవి ఝాన్సీరాణి వీరనారి ఈనారీమణి 
నీపాలిట మృత్యువురా పారిపోండిరా ఆంగ్లేయులు 
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు
పారిపోండిర పారిపోండిర నల్లమనసుల తెల్లమనుషులు 
నల్లమనసుల తెల్లమనుషులు   

వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి
ఉరిమైఉరిమెను పిడుగైసాగెను వీరనారి ఝన్సీరాణి 
ఆటకట్టు నీఆటకట్టు ఇకఆంగ్లేయుడా మూటకట్టు
వీరనారీ ఈఝాన్సిరాణీ    ఝాన్సిరాణీ లక్ష్మిబాయి

కార్తీక పురాణం 6వ రోజు

శివకేశవార్చన:
 వశిష్ఠులవారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి. 'ఓ రాజా! కార్తీకమాసము గురించి, దాని మహత్య్మము గురించి ఎంత చెప్పినా, వినిననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రకలశములతో పూజించినవారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గానీ బిల్వ పత్రములతో గానీ సహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించినచో కలుగు మోక్షమింతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదమయున, సాయంకాలమున యే గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసినా వారి పాపములు నశించును.'
సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేథ యాగము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునగాని, విష్ణాలయము నందుగాని జెండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాములైననూ పటాపంచలైపోవును.
ఈ కార్తీక మాసములో తులసికోటవద్ద ఆవుపేడతో అలికి, వరి పిండితో శంఖు, చక్ర ఆకారములతో ముగ్గులు వేసి నువ్వులు, దాన్యము పోసి వాటిపై ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి, నైవేద్యము పెట్టి, కార్తీక పురాణమును చదినచో హరిహరాదులు సంతసించి కైవల్యమొసంగెదరు.
అటులనే కార్తీక మాసములో ఈశ్వరుడుని జిల్లేడు పూలతో అర్చించిన ఆరోగ్యం సిద్ధించును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి, తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనముండీ కార్తీక మాసమందు పూజాదులను చేయడో ఆ మానవడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైననూ చేసి శివకేశవులను పూజించినా మాస ఫలము కలుగును.
కనుక 'ఓ రాజా! నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము' అని వశిష్ఠులవారు చెప్పెను.

ఆదివారం, నవంబర్ 18, 2012

కార్తీక పురాణం 5వ రోజు

ఆదివారం, నవంబర్ 18, 2012

దీపదాన మహాత్య్మం:
ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెలరోజులూ పరమేశ్వరుడిని, శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించిన వారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయూ దేవలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును.    
దీపదానుము చేయుట యెట్లనగా పైడిప్రత్తి తానే స్వయముగా తీసి, శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గానీ, గోధమపిండితో గాని ప్రమిద వలే చేయవలెను. ఆ ప్రమిదలో ఆవునేతితో తడిపిన వత్తులు వేసి, దీపమును వెలిగించి దానిని బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి, బంగారముతో వత్తిని చేయించి, ఆవునెయ్యి నిండుగా పోసి రోజూ చేస్తున్న ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపమును వెలిగించి ఈనెల రోజులూ దానమిచ్చిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమివ్వాలి. ఇలా చేసిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేకాక మోక్షప్రాప్తి కూడా సిద్ధించును.
దీప దానము చేయువారు ఇట్లా వచింపవలెను.
శ్లో: సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం 

    దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమఅని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగుజేయునదియు, సకల సంపదల నిచ్చునదియు అగు ఈ దీపదానమును చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక! అని అర్థము.

ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గానీ, స్త్రీలు గానీ, ఏ ఒక్కరు చేసినా సిరిసంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సంతోషముగా ఉందురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు. దానిని వివరించెదను ఆలకింపమని వశిష్టుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను.

లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట:పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుతే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచూ, వారి ఇండ్లలోనే భుజించుచూ, యజమానులు సంతోషముతో ఇచ్చిన వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచూ ఆ విధముగా వచ్చిన సొమ్మును అధిక వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనెను. దొంగలు తీసుకువచ్చిన దొంగ వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముచూ కూడా ధనమును కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడ బెట్టిన ధనమును వడ్డీలకిస్తూ, శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచిచేసుకొని జీవించుచుండెను.
ఎంత సంపాదించినా ఏమి? ఆమె ఒక్క రోజు కూడా ఉపవాసము గాని, దేవుడుని మనసారా ధ్యానించుట గాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థ యాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి, యే ఒక్క బిచ్చగానికీ పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంత కాలము జరిగెను.
ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని, ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి 'అమ్మా! నా హితవచనము ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకించుము. మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధావులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి, దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడి దురాలోచన.
తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని దినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాటలాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మము చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి రోజూ శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మొక్షమును పొందుము. నీ పాప పరిహారార్ధముగా, వచ్చే కార్తీక మాసమంతయూ ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మాలు చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవు' అని ఉపదేశమిచ్చెను.

ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచూ కార్తీక మాసం వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావు కార్తీక మాస వ్రతములో అంత మహాత్మ్యం ఉన్నది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)