Blogger Widgets

శుక్రవారం, నవంబర్ 08, 2013

అలమేలు మంగ శ్రీహరి హృదయలక్ష్మి గా

శుక్రవారం, నవంబర్ 08, 2013

జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి అలమేలు మంగ శ్రీహరి హృదయలక్ష్మి గా ఆవిర్భవించిన రోజు నేడే.
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి అనే అలర్‌మేర్‌మంగ కార్తీక శుక్ల పంచమి శుభముహూర్తాన తిరుచానూరులోని పద్మసరోవరంలో స్వర్ణకమలంలో ఆవిర్భవించి శ్రీనివాసుని అంతరంగమైంది. అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. 
అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడట. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళిందట. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడట. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి శుక్రవారం, నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుకలక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి")ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడట. 
అలమేలు మంగ శ్రీహరి హృదయలక్ష్మి గా
అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఇట్టి లక్ష్మీదేవియే "పద్మావతి" లేదా "అలమేలు మంగ" అనీ, అమెయే తిరుమల కొండపై శ్రీవారి మూర్తి వక్షస్థలంపై ఉన్న హృదయలక్ష్మి అనీ, ఆమెయే తిరుచానూరు ఆలయంలో వెలసిన అలమేలు మంగ అనీ భావించవచ్చును. అన్నమయ్య సంకీర్తనలలో అలమేలు మంగను శ్రీమహాలక్ష్మిగా పదే పదే వర్ణించాడు. 
 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
 

ప: అమ్మమ్మ యేమమ్మ అలమేల్మంగ నాచారమ్మ
తమ్మి యింట నలరుకొమ్మా వోయమ్మా

చ: నీరిలోనాఁదల్లడించి నీకే తలవంచి
నీరికిందాఁ బులకించి నీ రమణుండు
గోరికొనఁ జెమరించిఁ గోపమేపచరించి
సారెకు నీయల కిట్టె చాలించవమ్మా

చ: నీకుఁగానె చెయిజాఁచి నిండాఁ గోపమురేఁచి
మేకొని నీవిరహాన మేను వెంచేని
యీకడాకడి సతుల హృదయమే పెరరేఁచీ
నాకు మడిచియ్యనైనా నానతియ్యవమ్మా

చ: చక్కఁదనములె పెంచి నకలముఁగాలదంచి
నిక్కపు వేంకటేశుండు నీకె పొంచేని
మక్కువతో నలమేల్ మంగనాచారమ్మా నీ
యక్కున నాతని నిట్టె అలరించవమ్మా



వచ్చెను అలమేలుమంగ ఈ
పచ్చల కడియాల పణతి చెలంగ

బంగారు చేదివిటీలు పూని
శృంగారవతులు వేవేలురాగా
రంగైన వింజారమరలు వీవ
మాంగల్యలీల సొంపగు జవరాలు

పలుకుల తేనియ లొలుక చెంత
చిలుకలు కలకల పలుక రవల
గిలుకు పావలు ముద్దుగులుక మేటి
కలికి చూపుల మొనలు తళుకని చిలక

రంభాది సతులెల్ల చేరి యెదుట
గంభీర గతులను మీర నటనా
రంభములను మేలుకోరి కొలువ
అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి


 ఈరోజును జ్ఞాన పంచమి అని కూడా అంటారు. 

గురువారం, నవంబర్ 07, 2013

భారతరత్న సర్ చంద్రశేఖర వేంకట రామన్

గురువారం, నవంబర్ 07, 2013


ఆకాశం నీలంగా వుండడానికి, పగలు నక్షత్రాలు కనిపించకపోడానికి కారణాలు వివరించిన మహా శాస్త్రవేత్త సర్‌ సి.వి. రామన్‌... వి.రామన్‌ చరిత్ర పుటలకు ఎక్కారు. ప్రపంచ వ్యాప్తంగా భారతావనికి వన్నె తెచ్చిన సి.వి.రామన్‌ తిరుచురాపల్లి సమీపంలో 1888 వ సంవత్సరం నవంబర్ 7న జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఎమ్మే చదివి ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్‌ సైన్స్‌ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్‌ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్‌ ముఖర్జీ బ్రిటీష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్‌ సైన్స్‌ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుం దని సూచించారు. కానీ, బ్రిటీష్‌ ప్రభుత్వంఅంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 1928 ఫిబ్రవరి 28న సి.విరామన్‌ ''రామన్‌ ఎఫెక్ట్‌'' కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. మనదేశంలో పుట్టి, మనదేశంలోనే చదువుకొని, మనదేశంలోనే పరిశోధన చేసి, తన అత్యంత ... 1928లో రామన్‌కి ''సర్‌'' బిరుదు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్‌’ దినోత్సవంగా ప్రకటించింది.  భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ . 
భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930వ సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రామన్ కు లభించింది.  రామన్ పరిశోధనల్లో సౌందర్య దృష్టికి ప్రాముఖ్యతనిచ్చి ప్రకృతిపై దృష్టి సారించారు. సంగీతంలోని స్వరాలు,ప్రకృతిలోని రంగులు, ఆకాశం, నీటి రంగులు, పక్షులు, సీతాకోక చిలుకల అందాలు, నవరత్నాలు, నత్తగుల్లలు, వజ్రాలు ఇతని పరిశోధనా వస్తువులు."ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. "అని చెప్పారు రామన్. అందుకే "విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం" అన్నారు. గులాబీ తోటను అమితంగా ప్రేమించేవారు.


SIR CV Raman's Interview 

రామన్ ఫలితము - అనువర్తనాలు(ఉపయోగాలు)
  • అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు.
  • స్పటికంలో పరమాణువుల అమరిక, స్పటిక జాలకం, స్పటికీకరణ జలవంటి విషయాలు తెలుసుకోవచ్చు.
  • రేడియోధార్మికత,అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
  • అన్ని రాళ్ళను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు.
  • కర్బన రసాయన పదార్ధాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.
  • పలుచటి రాళ్ళలో స్పటిక నిర్మాణం ఎక్కువ వేడిమి, పీడనాల వల్ల ఖనిజాల స్వభావం జీవ ఖనిజాల లక్షణాలు తెలుసుకోవచ్చు.
  • మిశ్రమ లోహాలు, ఆ లోహాలు, ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.
  • వాహాకాలు, అర్థవాహకాలు, అతి వాహకాల స్వభావం తెలుసుకోవచ్చు.
  • మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, నూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.
  • డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (D.N.A) మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం.దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు.
  • పిత్తాశయంలోని కొన్ని రకాల రాళ్ళు, జీవ భాగాల అయస్కాంతత్వం రామన్ పరిచ్ఛేదన పద్ధతిలో తెలుసుకోవచ్చు.
  • మధుమేహం, కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.
  • వివిధ రకాలైన మందులు, ఔషధాలు డి.యన్.ఏ.పై చూపే ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.
  • వాతావరణంలో కాలుష్యాలైన CO2,CO,SO2,O3 ఉనికిని గుర్తించవచ్చు.
  • జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు.
  • ప్లాస్టిక్కులలో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.
  • ఏక, ద్వి, త్రిబంధ నిర్ధారణకు ఉపయోగపడుతుంది.
  • ఆమ్లజని, నత్రజని వంటి సజాతి కేంద్రక అణువుల్లో కంపన మరియు భ్రమణశక్తి స్థాయిల గూర్చి తెలుసుకోవచ్చు.
  • కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు.
  • ఘన పదార్ధల స్పటిక స్థితి, ద్రావణీయత, విద్యుత్ విఘటనం విషయాలు తెలుసుకోవచ్చు.ఆధునిక విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.
భారతరత్న సర్ చంద్రశేఖర వేంకట రామన్ జయంతి శుభాకాంక్షలు 

పాముని చుడగా బెదిరి

పాముని చుడగా బెదిరి చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం 
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయుగా అవిదేముడే ! కోల్వుడీ ప్రజల్

మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా.  దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి.  ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.  నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.  ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.  నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
లా "నాగుల చవితి రోజున ప్రత్యక్షముగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే ..మానవునిలో ఉన్న "విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,మన అందరి హృదయాలలో నివశించే "శ్రీ మహా విష్ణువు నకు" తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాంపుగా" మారాలనికోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయిటలలోగలాంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్యపరంగా చుస్తే...కుజ,రాహు దోషాలున్న వారు, సాంసారిక బాధలు ఉన్నవారు, ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ ,చతుర్దశలలో రోజంతా ఉపవాశము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరించాలి.

పాహి పాహి సర్ప రూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా!

నాగులు  చవితి  రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి. 
పాము పుట్ట లో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు 
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.  నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.  ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు. 
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

ఆ ప్రకృతిని మానవుడు చెజేతులార నాశనం చేసుకుంటే, ఇటు మానవ కోటికి, అటు జీవ కోటికి తప్పక వినాశనానికి దారితీస్తున్నందున భావముతో నేడు ప్రకృతిని - పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్ర
అలాగ ప్రకృతిని మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపముగా భావించి ఆనాటి నుండి నేటి వరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలాగ సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపముగా చూసుకుంటు పూజిస్తు వస్తున్నారు.

అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత!

అలా మనకంటికి కనబడే విషనాగుపాము కంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. 
ఈ మానవ శరీరము అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెమూకను "వెన్నుపాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తూన్నట్లు ,కామ, క్రోధ, లోభ,మోహ,మద,మత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో "సత్వ గుణ" సంపట్టిని హరించివేస్తూ ఉంటుంది.

యుగాల నాటిది. సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల సరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎనో గాధలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి.

ఈ "నాగుల చవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం .

నాగేంద్రా ! మేము మా వంశములో వారము నిన్ను ఆరధిస్తున్నాము. పొరపాటున "తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడు అనుకో! పడగ త్రొక్కితే కస్సుబూసుమని మమ్మల్ను భయ పెట్టకు తండ్రి ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు అంటారు.

ఈ నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది అని శస్త్రాలు పేర్కుంటున్నాయి. 

"కర్కోటకస్య నాగస్య
దమయంత్యా నలస్య చ 
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తినం కలినాశనం

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు, మొదలైనవి ప్రీతికరమైనవి అని చెప్తారు.

సర్పారధనచేసే వారి వంశం "తామరతంపరగా" వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్ణ్యేశ్వరుడే! 


నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నయని,గరళన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలాగ ప్రకృతిలో నాగు పాములకు ,మానవ మనుగడులకు అవినవ భావ సంబంధం కలదని విదితమవుతోంది.

ఈరోజు నాగుల చవితి సందర్భముగా అందరికి నాగులు చవితి శుభాకాంక్షలు. 

బుధవారం, నవంబర్ 06, 2013

ఎక్కువ లేదా తక్కువ మాట్లాడితే మంచిదా?

బుధవారం, నవంబర్ 06, 2013

మనకు కధలు వినటం అంటే చాలా ఇష్టం కదా! నాకు అయితే చాలా ఇష్టం. నాకు తెలిసిన మంచిది , చాలా చిన్నకధ మీకు షేర్ చేస్తున్నా చదవండి.   
అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?”
గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సూటికా అందరూ మెచ్చేదిగా వుండాలి,  అంతేకాదు అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”
సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళాడు. చిన్న కధ అయినా చాలా మంచి విషయం వుంది కదా. 

చల్లరే హరిపై జాజరజాజ


శంకరాభరణం

చల్లరే హరిపై జాజరజాజ
చల్లఁగా సరసపు జాజరజాజ. IIపల్లవిII

సతతపు వలపుల జాజరజాజ 
చతురలమాటల జాజరజాజ 
సతమగు నవ్వుల జాజరజాజ 
జతనపు సిగ్గుల జాజరజాజ. IIచల్లII

సముకపు కొసరుల జాజరజాజ 
సమరతికరఁగుల జాజరజాజ 
జమళి తమకముల జాజరజాజ 
సమయని యాసల జాజరజాజ. IIచల్లII 

జడియని పంతపు జాజరజాజ 
సడఁగుల చేఁతల జాజరజాజ 
జడిగొనుచెమటల జాజరజాజ 
జడగొను పెనఁగుల జాజరజాజ. IIచల్లII

చలముల వొట్ల జాజరజాజ 
సలిగెలపగటుల జాజరజాజ 
చలువల వినయపు జాజరజాజ 
సళుపుల చూపుల జాజరజాజ. IIచల్లII 

సంగడి మూఁకల జాజరజాజ 
జంగిలి మతకపు జాజరజాజ 
సంగాత మమరిన జాజరజాజ 
సంగతి యెరికల జాజరజాజ. IIచల్లII

సారపు మోవుల జాజరజాజ 
సారెకుఁ బొలసేటి జాజరజాజ 
సౌరుచి మెచ్చుల జాజరజాజ 
జారతనంబుల జాజరజాజ. IIచల్లII


సందడి కొలువుల జాజరజాజ 
సందుల వొత్తుల జాజరజాజ 
చందురు పాటల జాజరజాజ 
సందె చీఁకటుల జాజరజాజ. IIచల్లII


చాలుకొను సతుల జాజరజాజ 
జాలివిరహముల జాజరజాజ 
చాలామరిగిన జాజరజాజ 
చౌలూరించే జాజరజాజ. IIచల్లII


చనుఁగవ గురుతుల జాజరజాజ 
చనవుల కొసరుల జాజరజాజ 
యెనసెను శ్రీవేంకటేశ్వరుఁ డీతని 

చనుమానంబుల జాజరజాజ. IIచల్లII 

మంగళవారం, నవంబర్ 05, 2013

భగిని హస్త భోజనం

మంగళవారం, నవంబర్ 05, 2013

దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ అంటారు .
ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు.భాయ్ దూజ్ పండుగ యొక్క సారాంశం ఇది సోదర  మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బలోపేతం చేయడానికి జరుపుకుంటారు . ఇది సోదరుడుకు సోదరి భోజనం పెడుతుంది అప్పుడు సోదరుడు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. సాంప్రదాయకంగ అన్న  వివాహితులు అయిన చెల్లెలు ఇంటికి వెళ్లి  ఆమె మరియు భర్త యొక్క పరిస్థితులను తెలుసుకుంటారు.  వారు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం సోదరునికి ఇచ్చారు. ఈ పండుగ ద్వారా సిస్టర్స్ కూడా వారి సోదరుల దీర్ఘకాల జీవితం మరియు మంచి ఆరోగ్యానికి ప్రార్థన, మరియు శ్రేయస్సు కోరుకుంటారు.  దీనికి ఒక కదా వుంది.  ఆ కద ఏంటి అంటే.  యముడు యమునా సోదర సోదరిమణులు.  వారు కలసి పెరిగారు.  యమున ఒక అందమైన యువరాజును  వివాహం చేసుకొని, తన సోదరుడుకు దూరమయ్యింది.  అతనిని చూడాలని ఎక్కువగా అనిపించేది . యముడు కూడా తన సోదరిని చూడాలని అనుకునేవాడు.  కానీ కుదిరేది కాదు. అతనికి ఎప్పుడూ ఖాళీ దొరికేది కాదు.  ఎందుకంటే ఆటను నరకానికి అధిపతి కదా అందుకే.  యమునా ఎప్పుడు తన అన్నని తనని చూడటానికి రమ్మని పిలిచేది.  ఇలా చెల్లి దగ్గరకు వెళ్ళటానికి కుదరటంలేదు అనుకొని.  ఒకరోజు వెళ్ళటానికి ఒక రోజును నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడు వస్తున్నాడు అతనిని చూడచ్చు అని ఆనందం పట్టలేకపోయింది.  యమున అతనికి గౌరవార్ధం ఒక గొప్ప విందు భోజనం తయారు చేసింది. 
ఇది దీపావళి తరువాత  రెండు రోజులుకు వచ్చింది.  ఆమె తన ఇల్లంతా దీపములతో అలంకరించింది. ఆమె ఎంతో ప్రేమగా అన్ని మిఠాయిలు మరియు ఆమె సోదరుడు ప్రేమించిన ఆ పదార్ధాలు సహా, గొప్ప విందు తయారుచేసింది. ఆమె భర్త, అందమైన యువరాజు, యమున కలసి ఎంతో గొప్పగా యముడుకు స్వాగతం ఇచ్చారు.  అది చూసి యముడు  చాలా ఆనందం పొందాడు. యముడు కూడా తన సోదరి ప్రేమ పూర్వక స్వాగతం ద్వారా సంతోషపడ్డారు.  వారు చాలా కాలము తరువాత చాలా సంతోషంగా వున్నట్టు చెప్పుకున్నారు వారు.  యముడు యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు.  నీకు ఏమి కావాలి అని చెల్లెలిని అడిగాడు.  ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య అనింది.  అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది నేను తప్పక తీర్చుతాను అన్నాడు. 
వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు.  యమున నాకు ఒక కోరిక వుంది తీర్చుమన్నా అంది.  అది ఏమిటంటే అన్నదమ్ములు  కార్తీక విదియ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి సోదరిచేతి వంట తింటారో వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని కోరినది. యముడు తధాస్తు అన్నాడు. 



కృష్ణుడు నరకాసురుడును 
చంపిన తరువాత తన సోదరి సుభద్రను కలవటానికి వెళ్లారు. సుభద్ర హారతి ఇచ్చి ఇంటిలోనికి స్వాగతం పలికి నుదుటిపైన ఒక తిలక్ ఉంచడం ద్వారా సంప్రదాయ విధంగా వుంచారు.

సోమవారం, నవంబర్ 04, 2013

గోవర్ధనోద్ధరణం

సోమవారం, నవంబర్ 04, 2013


ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధనోద్ధరణం అనే పండుగను కూడా చేసుకుంటారు. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.
అందువలన యాదవులు  మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు.
కాని ఒకనోకనాడు కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొన్నాడు.మనకు ప్రధాన వనరు గోవర్ధనం కనుక నాకు గోవుల్ని,బ్రాహ్మణులని,గోవర్ధనం ను అరాధి౦చుదామ్, ఇంద్ర యజ్ఞం నాకు సమ్మతం కాదు అని సర్వులకు నచ్చచెప్పి ఇంద్ర యజ్ఞ నిర్వహణ నిలుపుదల చేస్తాడు.
దీనితో యాదవులందరు గోవర్ధన ప్రదక్షిణతో అచలవ్రతం చేయనారంభిస్తారు.  దానితో ఇంద్రునికి కోపం వచ్చి వడగళ్ళ వర్షాన్ని కురిపిస్తాడు.  ప్రజలందరు చాలా భయపడతారు. కొద్ది సేపటికే ప్రజలు అక్కడ జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడింది .  దీనితో యాదవులందరు శ్రీకృష్ణుని శరణాగతి కోరటం తో స్వామీ గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి సర్వప్రజలకు,గోవులకు రక్షణ కల్పిస్తాడు. ఈ విధంగా 7 రాత్రులు 7 పగళ్ళు నిరంతర వర్షం కురుస్తున్న తనను శరణాగతి కోరిన వారికి రక్షణ కల్పిస్తాడు.తన ఆశ్రయం లో వున్న వారికి తాము ఇన్ని రోజులు వున్నాం అనే భావన రాకు౦డా యోగమాయ ద్వార వారు ఆనందసాగరం లో వుండే విధంగా అనుగ్రహిస్తాడు.ఈ విధంగా ఇంద్రుని గర్వభంగం చేస్తాడు.
ప్రజలందరు గోవులను కాపాడిన వాడు కాబట్టి గోవిందుడు అని పొగడుతు తమ నివాసాలకు తిరిగి చేరుతారు.
గోవర్ధనోద్ధరణం

పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:

“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.

శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.
ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.దానికి గుర్తుగానే ఈరోజు ఈ పండుగ చేసుకుంటారు. ఆవు పేడతో పర్వతాకారాన్ని పెట్టి దానికి పూలతో, శ్రీకృష్ణ అష్టోత్తర నామాలతో పూజ చేస్తారు. ఈరోజు గోక్రీడనమనే ఉత్సవం కూడా చేస్తారు. గోవు సర్వదేవతామయం అన్నది హిందువుల నమ్మకం. అందుకే ఈ రోజు గోవులను, దూడలను శుభ్రం చేసి పసుపు, కుంకుమలు, పువ్వుల దండలతో అలంకరించి వాటికిష్టమైన పచ్చగడ్డిని ఆహారంగా పెట్టి పూజిస్తారు. 

శనివారం, నవంబర్ 02, 2013

జ్యోతి స్వరూప దీపలక్ష్మి

శనివారం, నవంబర్ 02, 2013

దీపావళి భారతీయులకు అత్యంత విశిష్టమైన ప్రీతిపాత్రమైన పండుగ. పిల్ల పెద్ద అందరూ ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ ఈ దీపావళి.  
దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.
తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. క్షీర సాగర మధనంలో నుండి లక్ష్మి దేవి ఈ రోజున ఉద్భవించింది అని ఒక నమ్మకం ఉంది. దీపావళి విధివిదానం .  
బలి చక్రవర్తి శ్రీలక్ష్మిని, ఇతర దేవతలను సైతం తన కారాగారంలో బంధించాడు. దీంతో విష్ణుమూర్తి వామనావతారంతో బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేలను దానం అడిగి .  ఒక అడుగు భూమి మీద, రెండవ అడుగు ఆకాశంపైన వేసి మూడవ అడుగు ఎక్కడ వెయ్యను అని అడిగిన విష్ణువుకు తన తలమీద వేయమనగా విష్ణువు తన మూడవ అడుగు బాలి తలపై వేసి, బలి చక్రవర్తిని పాతాళానికి పంపించివేసి, దేవతలను విడిపిస్తాడు.  బలి చక్రవర్తిని పాతాళానికి రాజును చేసేను.   ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా దీపావళి రాత్రి నాడు దీపాలపండుగ జరుపుకుంటారని ప్రతీతి. అందుకోసం ఇంటి ముందు కళ్ళాపి చల్లి, రంగవల్లులు తీర్చిదిద్ది అలంకరించిన ఇంటి ముంగిటి ద్వారాలు తెరచి శ్రీమహాలక్ష్మికి స్వాగతం పలుకుతారు. జ్ఞాన దృష్టితో చూస్తే, దీని అర్థం నరకాసుర మాయ. మనోవికారాలనే దీనికి పర్యాయంగా చెప్పవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలని చెబుతారు. వీటిపై విజయం సాధించడం ఎంతో కష్టం. గీతా సారంలో మాయకు మరో అర్థంగా బలిని చెప్పారు.  సత్య యుగ ఆరంభానికి ప్రతీకగా తరువాతి రోజును పెద్ద దీపావళి పర్వదినంగా నిర్వహిస్తారు. జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ , మార్వాడీలకు ఈ రోజు లక్ష్మీ పూజా దినం. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మహిళలు ఎక్కువగా నమ్ముతారు. దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి - రాముడు 14 ఏళ్ల వనవాసం తరవాత రావణుడిని చంపి ఆయోధ్యకు తిరిగి వస్తాడు. రాముడు రావణుడిని చంపిన రోజుని విజయదశమిగా జరుపుకుంటారు. అయోధ్యకు చేరిన రోజును దీపావళి గా జరుపుకుంటారు అని ఇంకో కధ గా వుంది.  ఇంకా దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు తొలుత దీపాలు వెలిగించి.. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి 'చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్" అని ధ్యానించి.. తులసీ పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాలిఅందియలు ఘల్లుఘల్లుమని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం.
దీపావళి ని ఎంతో  జరుపుకోండి. 
దీపావళి శుభాకాంక్షలు 
 అందరికి దీపావళి శుభాకాంక్షలు. 

నరక చతుర్దశి

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గురించి తెలుసుకుందాం.  వరాహావతారంలో మహావిష్ణువుకు భూదేవి  కుమారుడు నరకాసురుడు.  భూదేవి  శాపవశమున నరకాసురుడు శ్రీ కృష్ణుని తో సంహరించబడతాడు. నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందం ఉత్తర భాగములొ వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకొంటారు హిందువులు. తరువాతి రోజుని దీపావళి జరుపుకొంటారు.  ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. 
కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనామహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామ గా జన్మిస్తుంది.
నరకాసురుడు ప్రాగ్-జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు. ప్రస్థుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. అనేక సంవత్సరాలు తపస్సులు చేసి బ్రహ్మ చేత వరాలు పొందాడు. ఆ వరగర్వంతో గర్వాంధుడై మానవుల్ని, దేవతలను, సాధువులను, తాపసులను హింసించేవాడు. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలకు బానిసైనాడు. గోబ్రాహ్మణులను పనికట్టుకు బాధించేవాడు. పదహారువేల మంది స్ర్తిలను చెరబట్టినాడు. దైవ దూషణ మితిమీరి చేసేవాడు. వీని దుష్టచేష్టలను భరించలేక భూదేవి మహావిష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. వరబలం, మదబలం కలిసి ఉండే నరకుని వలన ముల్లోకాలు గడగడలాడాయ. విశ్వకర్మ కూతుర్ని బలాత్కరించాడు. ఇంద్రుడి మాత అదితి కుండలాలను హరించాడు. ఇక నరకుని బాధ భరించలేక బ్రహ్మాదిదేవతలు మహావిష్ణువును శరణు కోరారు. అపుడు మహావిష్ణువు ద్వారకలో నివసించే శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి నరకుని పీడ వదిలిస్తాడని అభయం ఇచ్చాడు.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.   భూమాత ఎంత గొప్పదో కదా.  కొడుకు లోకకంతకుడు అని తెలిసి క్షమించకుండా మరణశిక్ష విధించింది.   
 ఆరోజే ఆశ్వీజమాస కృష్ణపక్ష చతుర్దశి. అదే నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. లోక కంటకుల వినాశనానికి గుర్తుగా, లోకాలన్నీ ఆనందించేటట్టుగా బాణాసంచా కాల్చారు. నరకుణ్ణి అజ్ఞానానికి ప్రతీకగా భావించి దాన్ని దూరం చేసామని జ్ఞానానికి ప్రతీకలైన దీపాలు వెలిగించి తమను కాపాడిన దేవదేవునకు అందరూ నమస్కరించారు. ఆ నరకుని పీడ వదిలిన సందర్భంగా చతుర్ధశి తెల్లవారు జామున ‘చతుర్వత్తుల’ దీపం వెల్గించి యమధర్మరాజునుద్దేశించి తర్పణం వదలుతారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి అని మూడు రోజులు జరుపుకొంటారు. ఉత్తర భారతంలో ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయ అని ఐదు రోజులు జరుపుకొంటారు.
చతుర్దశికి ముందు రోజు బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఆ రోజు రాత్రి అపమృత్యువును తప్పించుకొనేదానికి ‘యమదీపం’ పెడతారు. నూనెతో దీపాన్ని వెలిగించి పూజ చేసి గుమ్మానికెదురుగా ఇంటి బయట ఉంచి, యమధర్మరాజు దయను కోరుకోవడం అందువల్ల దీనికి యమదీపం అన్న పేరు వచ్చింది. ఈ చతుర్దశి తర్వాత వచ్చే అమావాస్య నాటి రాత్రి ఒకేఒక దీపాన్ని వెలిగించి ఒక పళ్ళెం నిండా ధాన్యాన్ని నింపి, పళ్ళెం మధ్యలో ఆ వెల్గించిన దీపాన్ని పెట్టి భూమాతను పూజిస్తారు. ఆ తరువాత ఆ దివ్వెను ఇంటిలో, బయట ఆవరణ అంతా మూల మూలనా వెలుగుపడేలా త్రిప్పి తిరిగి తెచ్చి దేవునివద్ద ఉంచుతారు. ఇలాచేయడం తమలోఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలమని భగవంతునికి విన్నపం అన్నమాట. తరువాత ఆ దీపంతోనే అనేక దీపాలు వెలిగిస్తారు. ఇది కన్నడ దేశ పద్ధతి. బెంగాల్‌లో దీపావళి నాడు కాశీపూజ చేస్తారు. ఒరిస్సాలో దీపావళి నాటి రాత్రి లక్ష్మీపూజ, కులదేవతార్చన చేసి, క్రొత్త బట్టలు కట్టుకుని సన్నగా చీల్చిన చెఱుకు పుల్లలకు దూదిని చుట్టి, నువ్వుల నూనెలో ముంచి వెలిగించి ‘పితృణం మార్గదర్శనం’’ అంటూ ఆకాశం వైపు చూపిస్తారు. మార్వాడీలు దీపావళినాడు వెండి, బంగారు నాణేలతో లక్ష్మీదేవిని పూజించి ఆ రోజునే నూతన సంవత్సరాంభం చేసి, కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు.  తీపి వంటకాలను చేసి బంధుమిత్రులకు విందు చేయటం, బాణసంచా కాల్చి,  సంప్రదాయంగా చేస్తారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.  

శుక్రవారం, నవంబర్ 01, 2013

"ఆంధ్రా షెల్లీ" జయంతి శుభాకాంక్షలు.

శుక్రవారం, నవంబర్ 01, 2013

దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు జయంతి నేడే తెలుగు సాహితీ ప్రియులందరికీ శుభాకాంక్షలు. 
 మావి చిగురు తినగానే కోయిల పలికేనా,   ఆకులో ఆకునై, పూవులో పూవునై, గోరింట పూచింది కొమ్మ లేకుండా, ఆరనీకుమా ఈ దీపం,  ప్రతి రాత్రి వసంత రాత్రి , పాడనా తెనుగు పాట, ఇది మల్లెల వేళయనీ,  ఎవరు నేర్పేరమ్మ... ఈ కొమ్మకు  ఈ పాటలు అన్నీ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్యమైన పాటలు . దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లాపిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం.   కృష్ణశాస్త్రి గారి పాటలు అన్ని అమృత గుళికలే.  ఈయన ఆధునికాంద్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిబావంతుడైన రచయిత.  భావకవిత్వపు, ప్రచారకుడు క్రుష్ణపక్షానికి వెలలేని వెన్నెల వెలుగులు అందించిన చంద్రుడు.   తెలుగుకు వెలుగులు తెచ్చి సూటిదనాన్ని, సున్నితత్వాన్ని సాహిత్యపు కమ్మని రుచిని అందించిన ఆధునిక బావకవి దేవులపల్లి వారు. శ్రీ  దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితారంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు రచించిన మంచి దేశభక్తి గీతం  

పల్లవి :
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్త్ర
నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||


చరణం 1 :

జయ జయ సశ్యామల
సుశ్యామల చలచ్ఛేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయశయ
లక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||


చరణం 2 :

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరిశోధన
జయ గాయక వైతాళిక
కల విశాల పద విహరిణి
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ ||| జయ జయ జయ |||

"ధన్వంతరి"

ఈరోజు ధన్వంతరి జయంతి.   ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు.  ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. 
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు.  ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.  కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.  విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది.  పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి  చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి  అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)